ఢిల్లీ

ఢిల్లీ : పోక్సో చట్ట సవరణ ఆర్టినెన్స్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ చట్టం ద్వారా ఇకపై 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణదండన విధిస్తారు. గత కొన్ని రోజులుగా చిన్నారులపై లైంగికదాడులు పెరిగిపోవడంతో... నిన్న కేంద్రమంత్రి వర్గం సమావేశంలో ఈ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ విడుదల చేశారు. దీనికి ఇవాళ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధిస్తారు. ఇక ఈ కేసు దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తి చేయాలి. ఇందుకోసం అన్ని పోలీస్స్టేషన్లకు, ఆస్పత్రులకు ఫోరెన్సిక్ కిట్లను అందించాలని నిర్ణయించారు. ఇక 12 నుంచి 16 ఏళ్ల బాలికలపై లైంగికదాడులకు పాల్పడితే గతంలో కంటే కఠిన శిక్ష విధించనున్నారు. అలాగే మహిళలపై లైంగికదాడులకు పాల్పడితే శిక్షను ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచాలని నిర్ణయించారు.
ఢిల్లీ : వివాదాస్పద ఆధ్యాత్మక గురువు ఆశారాంపై ఉన్న అత్యాచారం అభియోగం కేసులో ఏప్రిల్ 25న జోధ్పూర్ ప్రత్యేక కోర్టు కీలకమైన తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జోథ్పూర్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నెల 30వ తేదీ వరకూ పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ఎస్పీ దినేష్ త్రిపాఠి తెలిపారు. ఆశారాంపై ఫిర్యాదు చేసిన బాధితురాలి నివాసం వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. 2012లో జోధ్పూర్ సమీపంలోని ఆశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆశారాం బాపుపై కేసు నమోదైంది. పోస్కో చట్టం, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆశారాం 2013 ఆగస్టు 31 నుంచి జోథ్పూర్ జైలులోనే ఉన్నారు. అత్యాచారం కేసులో ఆయన దోషిగా తేలితే గరిష్టంగా 10 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది.
ఢిల్లీ : చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణ శిక్ష విధించాలని నిర్ణయించింది. పోక్సో చట్ట సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కథువా, సూరత్, ఎటా, ఛత్తీస్గఢ్, ఇండోర్...దేశంలో ఎక్కడో ఓ చోట చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ ఘటనలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుండడంతో . ప్రధాని నరేంద్రమోది నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం జరిపింది.
సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో పోక్సో చట్టాన్ని సవరించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే దోషులకు మరణశిక్ష విధించేలా మోది ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ కేసుల్లో విచారణ 2 నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. 16 ఏళ్ల బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారి శిక్షను పదేళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు.
చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టం కింద కనిష్ఠంగా ఏడేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదును విధించే అవకాశం ఉంది. లైంగిక దాడి తర్వాత బాధితురాలు మృతి చెందినా, అచేతనంగా మారినా ముద్దాయికి మరణదండన విధించేలా పోక్సో చట్టంలో నిబంధనలు మార్చనున్నారు. ఈ ఆర్డినెన్స్కు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపనున్నారు. వర్షాకాల సమావేశాల్లో ఈమేరకు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కేంద్రం భావిస్తోంది.
ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలో ఏడు రాజకీయ పార్టీలు ఉపరాష్ట్రపతికి నోటీసు అందజేశాయి. చీఫ్ జస్టిస్ మిశ్రా అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు విపక్షాలు ఆరోపించాయి.
ఏకతాటిపైకి వచ్చిన విపక్షాలు
జస్టిస్ లోయాది సహజమరణమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏడు ప్రతిపక్ష పార్టీలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి దీనికి సంబంధించిన నోటీసును అందజేశాయి.
అభిశంసన నోటీసుపై 71 మంది ఎంపీలు సంతకాలు
అభిశంసన నోటీసుపై 71 మంది ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో ఏడుగురి పదవీ కాలం ముగిసినందువల్ల ఈ నోటీసుపై సంతకాలు చేసినవారి సంఖ్య 64కి తగ్గింది. ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, ముస్లిం లీగ్, జఎంఎం, సిపిఐ ఎంపీలు సంతకాలు చేశారు. మాజీ ప్రధాని కావడంతో మన్మోహన్సింగ్ సంతకం చేయలేదు. తీర్మానాన్ని అనుమతించేందుకు అవరమైనదానికన్నా ఎక్కువ మద్దతు తమకు ఉందని, అందువల్ల రాజ్యసభ చైర్మన్ తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు.
జస్టిస్ దీపక్ మిశ్రాపై 5 తీవ్రమైన ఆరోపణలు
వెంకయ్యనాయుడుకు అందించిన నోటీసులో విపక్షాలు జస్టిస్ దీపక్ మిశ్రాపై 5 తీవ్రమైన ఆరోపణలు చేశాయి. సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థ సరిగా లేదని...కేసుల కేటాయింపులపై సిజెఐ వివక్ష చూపుతున్నారని మీడియా సమావేశంలో నలుగురు న్యాయమూర్తులు చేసిన ఆరోపణలను కూడా ప్రస్తావించారు. చీఫ్ జస్టిస్ తన పదవిని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబ్బల్ ఆరోపించారు.
అభిశంసన తీర్మానం ప్రక్రియ పార్లమెంట్కు సంబంధించిందిన్న కరత్
చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రక్రియ పార్లమెంట్కు సంబంధించినదని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ అన్నారు. సిజెఐ అభిశంసనపై తమ పార్లమెంటరీ పార్టీ సభ్యులు సంతకం పెడితే సిపిఎం మద్దతిచ్చినట్లేనని కరత్ చెప్పారు.
ఇది న్యాయవ్యవస్థ స్వాతంత్రానికి ముప్పు : ఆరుణ్ జైట్లీ
అభిశంసన అనే అస్త్రాన్ని ప్రయోగించి విపక్షాలు న్యాయమూర్తులను భయపెట్టే యత్నం చేస్తున్నాయని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఆరోపించారు. ఇది న్యాయవ్యవస్థ స్వాతంత్రానికి ముప్పని ఫేస్బుక్లో పోస్టు చేశారు.
మహాభియోగంపై సమాజంలో చర్చ దురదృష్టకరం : సుప్రీంకోర్టు
మహాభియోగంపై సమాజంలో చర్చ జరగడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థపై ప్రజల్లో సదభిప్రాయం సన్నగిల్లే ప్రమాదముందని హెచ్చరించింది. సీజేఐపై అభిశంసన తీర్మానానికి అనుమతి లభించాలంటే 100 మంది లోక్సభ సభ్యులు కానీ, 50 మంది రాజ్యసభ సభ్యులు కానీ మద్దతివ్వాలి. భారత దేశ చరిత్రలో ఏ ప్రధాన న్యాయమూర్తి కూడా ఇప్పటివరకు అభిశంసనకు గురికాలేదు.
ఢిల్లీ : జస్టిస్ లోయ మృతి కేసులో పిటిషన్లు కొట్టివేసినందుకు జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకులతో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ భేటీ కానున్నారు. అభిశంసన తీర్మానంపై సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీ, ఎస్పీ సభ్యుల నుండి 60 మంది సంతకాలను ఆజాద్ సేకరించారు. అభిశంసన తీర్మానానికి 100 మంది లోక్ సభ, 50 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరముంది. అభిశంసన తీర్మానాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెరపైకి తీసుకొచ్చారు. అభిశంసన తీర్మానానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

ఢిల్లీ : ప్రపంచంలోనే ప్రజాస్వామ్యదేశం అని భారతదేశానికి పేరు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ప్రజాస్వామ్యానికి అసలు అర్థం వుందా? అసలు భారత్ లో ప్రజాస్వామ్యం వుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితులు న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితులు. ఒకపక్క మృగాళ్ల చేతుల్లో చిద్రమైపోతున్న చిన్నారులు. వివిధ కారణాలతో అంతులేని హింసలకు బలైపోతున్న ఆడబిడ్డలు. పెరిగిపోతున్న మతోన్మాదం,యేరుల్లా పారుతున్న మద్యం మనిషిలో వుండే విచక్షణను కూని చేస్తు ఆడబిడ్డలపై జరుగుతున్న హింసాత్మక మారణ కాండకు సమిధల్లా మాడిపోతున్న అభాగ్యులు. పశుత్వ కాంక్షలకు బలైపోతున్న చిన్నారులు. వయస్సుతో సంబంధం లేకుండా అంతులేని అత్యాచారాలకు గురయి ఊహించేందుకే భయపడేంత హింసలను అనుభవిస్తు కూలిపోతున్న, కాలిపోతున్న మహిళ జీవితాలు మరోపక్క. ఇవేవీ పట్టనట్లుగా ప్రజాప్రతినిధులు తమ ఓటు బ్యాంకులకు మాత్రం మహిళలను వినియోగించుకుంటున్నారు. అనంతరం అధాకారాన్ని అడ్డంపెట్టుకుని కొందరు ప్రజాప్రతినిధులు మహిళలపై హింసలకు, దాడులకు, హత్యలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
వీరా ప్రజాప్రతినిధులు?..
ప్రజా ప్రనిధులు అంటే ప్రజలను రక్షించేవారు, ప్రజలు బాగోగులు చూసేవారు. కానీ వీరా ప్రజాప్రతినిధులు అని సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు నేడు భారత దేశంలో వున్నాయి. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి రాజ్యాంబద్ధంగా పాలన సాగించాల్సిన వీరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలపై సాగిస్తున్న అరాచాలకు అంతులేకుండా పోతోంది.
48 మంది ప్రజాప్రతినిధులు మహిళలపై జరిగిన నేరాలకు పాల్పడ్డారన్న ఏడీఆర్ నివేదిక..
మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 48మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్లో ఓ మహిళపై బీజేపీ ఎమ్మెల్యే లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం, జమ్ముకశ్మీర్లోని కతువాలో ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి, హత్యకు పాల్పడిన సంఘటన వెలుగుచూసిన నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఓ నివేదికను విడుదల చేసింది.
1580 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరాభియోగాలు ..
ఆ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 1580 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరాభియోగాలు ఉండగా, అందులో 48 మంది మహిళలపై నేరాలకు పాల్పడినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వీరిలో 45 మంది ఎమ్మెల్యేలు కాగా, మిగతా ముగ్గురు ఎంపీలు. ఇందులో 12 మంది బీజేపీకి చెందిన వాళ్లే. తర్వాత స్థానాల్లో శివసేన (7), తృణమూల్ కాంగ్రెస్ (6) ఉన్నాయి. రాష్ర్టాల వారీగా చూస్తే మహారాష్ట్రలో 12 మందిపై అభియోగాలుండగా, తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్ (11), ఒడిశా (5), ఆంధ్రప్రదేశ్ (5) ఉన్నాయి. ఈ 48 మందిపై మహిళల కిడ్నాప్, లైంగికదాడి, అపహరణ, గృహహింస, అక్రమ రవాణా, దాడి, పెండ్లి చేసుకోవాలంటూ బలవంతం చేయడం లాంటి కేసులు నమోదయ్యాయి.

లండన్ : కతువా, ఉన్నావ్లో జరిగిన అత్యాచార ఘటనలపై విమర్శలు వెల్లువెత్తుతుండడంత ప్రధాని మోదీ లండన్ పర్యటనలో ప్రస్తావించారు. సెంట్రల్ లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చిన్న పిల్లలపై అత్యాచారం జరగడం ఎంతో బాధను కలిగిస్తుందన్నారు. అత్యాచారం లాంటి ఘటనలను ప్రభుత్వాలతో పోల్చలేమని, రేప్ను రేప్గానే పరిగణించాలని, ఇలాంటి వాటిని ఎలా ఆమోదిస్తామని ప్రశ్నించారు. దీనిపై రాజకీయాలు చేయడం తగదన్నారు. అత్యాచారాల విషయంలో ఎర్రకోట నుంచే తల్లిదండ్రులకు తాను సందేశమిచ్చానని తెలిపారు. కూతురు ఇంటికి ఆలస్యంగా వస్తే ఎక్కడికెళ్లావని ప్రశ్నించే పేరెంట్స్...అదే కుమారుడు కూడా ఆలస్యంగా వస్తే ప్రశ్నించాలన్నారు.
ఢిల్లీ : సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయాది సహజ మరణమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లోయా మరణంపై సిట్ విచారణ జరిపించాలన్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. కోర్టు తీర్పుపై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. దర్యాప్తు జరపకుండా లోయాది సహజమరణమని ఎలా ధృవీకరిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం తిరిగి రివ్యూ చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేసింది.
సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి బి.హెచ్ లోయా మృతిపై సిట్ ఏర్పాటు చేసి స్వతంత్ర విచారణ జరపించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో స్వతంత్ర విచారణ అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది. లోయాది సహజ మరణమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ విభేదాలను పరిష్కరించుకునేందుకు కోర్టులు వేదిక కాకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. లోయా మృతి కేసులో నలుగురు జడ్జిలు సందేహాలు వ్యక్తం చేయడం కారణంగా చూపలేమని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
సుప్రీం తీర్పుపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఇవాళ మాకు బ్లాక్ డే లాంటిదని పేర్కొన్నారు. లోయా గుండెపోటుతో మృతి చెందినట్లు ఈసీజీ రిపోర్టులో లేదన్నారు. లోయా మృతిపై సిట్ విచారణ జరిపించాలన్న పిటిషన్లను కోర్టు తిరస్కరించడాన్ని సిపిఎం తప్పుపట్టింది. లోయా మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసును పెద్ద ధర్మాసనం ముందుంచి రివ్యూ జరపాలని సిపిఎం డిమాండ్ చేసింది.
భారతదేశ చరిత్రలో ఈరోజు విచారకరమైన దినమని సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. సోహ్రాబుద్దీన్ కేసులో విచారణ జరుపుతున్న జడ్జి లోయా మృతిపై అనేక అనుమానాలున్నాయని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దర్యాప్తు జరగకుండా సహజమరణమని ఎలా చెబుతారని ప్రశ్నించింది. సుప్రీం తీర్పుపై బిజెపి తీవ్రస్థాయిలో స్పందించింది. బిజెపిని అభాసుపాలు చేసేందుకే రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ కోర్టును వేదికగా చేసుకుందని విమర్శించింది. ఇందుకు రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసుకు జస్టిస్ లోయా విచారణ న్యాయమూర్తిగా ఉన్నారు. తుది తీర్పు మరికొద్ది రోజుల్లో వెలువడుతుందనగా లోయా 2014 డిసెంబర్లో అకస్మాత్తుగా చనిపోయారు. ఈ కేసులో బిజెపి చీఫ్ అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. లోయాది సహజ మరణం కాదని, ఆయన మృతి వెనుక కుట్ర ఉన్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించడం సంచలనం సృష్టించింది. లోయా మరణం తర్వాత కేవలం నెల రోజుల్లోనే సోహ్రబుద్దీన్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షాను సీబీఐ కోర్టు నిర్దోషిగా విడుదల చేయడం గమనార్హం. దీంతో లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

ఢిల్లీ : దేశంలో ఆయా రాష్ట్రాల్లో నగదు కొరత సమస్య రేపటికల్లా పరిష్కారమవుతుందని ఎస్బిఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. ఏయే ప్రాంతాల్లో నగదు కొరత అధికంగా ఉందో ఆయా ప్రాంతాలకు డబ్బు రవాణా జరుగుతోందని... ఈరోజు సాయంత్రానికి ఆయా రాష్ట్రాలకు చేరుకుంటుందని చెప్పారు. రేపటిలోగా డబ్బు అందుబాటులోకి వస్తుందన్నారు. డబ్బు కొరత అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేదని... తెలంగాణ, బిహార్ తదితర రాష్ట్రాల్లో సమస్య అధికంగా ఉందని రజనీష్ వెల్లడించారు.. ఎటిఎంల నుంచి డబ్బు విత్డ్రా చేస్తే తిరిగి మళ్లీ ఆ డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ అవుతుంటేనే నగదు రొటేషన్ సజావుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు డిపాజిట్ చేయకుండా తమ వద్దే ఉంచుకుంటే.. బ్యాంకులు ఎంత డబ్బు సరఫరా చేసినా సరిపోదన్నారు. డబ్బు కొరత తీర్చేందుకు ఇప్పటికే బ్యాంకులు అధిక నగదు నిల్వలు ఉన్న రాష్ట్రాల నుంచి విమానాల ద్వారా తరలిస్తున్నారు.
ఢిల్లీ : జస్టిస్ లోయ మృతిపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును జస్టిస్ లోయ విచారించారు. తీర్పు వెలువడానికి ముందు 2014 డిసెంబర్ 1న జస్టిస్ లోయ మహారాష్ట్రలోని నాగపూర్లో మరణించారు. అయితే జస్టిస్ లోయ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. లోయ మృతిపై విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Pages
Don't Miss
