కాంట్రవర్సీలు లేని దేశం ఉండదు. ప్రజాస్వామ్య దేశమైన మన దగ్గర దానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. భావప్రకటన ఉన్న దగ్గర భిన్న అభిప్రాయాలు సంఘర్షిస్తాయి. ఆ సంఘర్షణలోంచి కాంట్రవర్సీలు పుట్టుకొస్తాయి. అలాగే దేశంలో అనేక కాంట్రవర్సీలు కొనసాగాయి. ముఖ్యంగా 2022 ఏడాది అయితే కాంట్రవర్సీనామ సంవత్సరంగా నామకరణం చేయొచ్చు. హిజాబ్ వివాదం నుంచి కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు అంశం వరకు కొందరికి నిద్రలేని రాత్రులుగా మిగిలాయి ఈ కాంట్రవర్సీలు. అయితే ఈ ఏడాది దేశాన్ని కుదిపివేసిన ఐదు ప్రధాన కాంట్రవర్సీల గురించి చెప్పుకుందాం.

హిజాబ్ వివాదం

కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో ఉన్న పీయూ కాలేజీలో మొదలైన ఈ వివాదం దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది. విద్యార్థుల యూనిఫాం విషయంలో పీయూ కాలేజీ గతేడాది జూన్‭లో తెచ్చిన మార్గదర్శకాలు ఈ వివాదానికి కారణమై ఈ ఏడాదిలో ప్రధాన వివాదంగా మారింది. హిజాబ్‌కు వ్యతిరేకంగా హిందూ సంఘాలకు చెందిన విద్యార్థులు కాషాయ శాలువాలతో కాలేజీకి రావడం, అనంతరం హిజాబ్ అనుకూల ఆందోళనలు చెలరేగడం.. రాజకీయంగా పెద్ద దుమారమే కొనసాగింది.

నుపుర్ శర్మ వ్యాఖ్యలు

ఓ టీవీ ఛానల్‭లో చర్చ సందర్భంగా మహ్మద్ ప్రవక్తపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అయిన నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఇస్లాం దేశాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో వెంటనే ఆమెను పార్టీ నుంచి తొలగించింది బీజేపీ. అయినప్పటికీ ఈ వివాదం సద్దుమనగలేదు. నుపుర్ శర్మకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆమెకు మద్దతుగా కూడా చాలానే జరిగాయి. ఇందులో భాగంగా ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ జూన్ 3న కాన్పూర్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి.

అగ్నివీర్‭కు వ్యతిరేకంగా ఆందోళన

'అగ్నిపథ్‌' పథకాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన నిరసన హింసాత్మమయ్యాయి. అగ్నిపథ్ పథకం ప్రకారం నాలుగేళ్ల తరువాత 25 శాతం మంది మాత్రమే పర్మినెంట్ సైనికులవుతారు. మిగిలినవారికి 11-12 లక్షల చొప్పున సెటిల్మెంట్ ప్యాకేజ్ ఇచ్చి పంపించేస్తారు. పెన్షన్ సౌకర్యం కూడా ఉండదు. ఇదే దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. మిలిటరీలో చేరాలనుకునే ఆశావాహలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.దీనికి తోడు అగ్నివీరులుగా నాలుగేళ్ల పూర్తి చేసుకున్న వారిని సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామని కేంద్రంలో పెద్దలు వ్యాఖ్యానించడం మరింత ఆగ్రహానికి కారణమైంది.

జ్ఞానవాపి మసీదు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో శివలింగం కనిపించందని, లోపల హిందూ దేవతల చిత్రాలు, ఇతర సంకేతాలు ఉన్నాయంటూ మొదలైన వివాదం వారణాసి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఒక వైపు హిందూ సంఘాల ఆరోపణలు మరొకవైపు, ముస్లిం సంఘాల నిరసనల నడుమ కోర్టులు సైతం ఏదీ తేల్చలేని సంకటం నెలకొంది. నిజానికి అక్కడ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని 30 ఏళ్ల క్రితమే వివాదం మొదలైంది. తాజాగా ఈ వివాదాన్ని ఐదుగురు మహిళలు సరికొత్త మలుపు తిరిగేలా చేశారు.

శివసేనలో చీలిక

ప్రజలు ఇచ్చిన తీర్పు కాకుండా భావజాలపరంగా పూర్తి విరుద్ధమైన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏక్‭నాథ్ షిండే తిరుగుబాటు చేయడం, అనంతరం మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోవడం, ఫడ్నవీస్-షిండే కలయికలో ప్రభుత్వం ఏర్పడడం జరిగిపోయాయి. ఇక అసలైన శివసేన గొడవ కోర్టుకు ముందకు వెళ్లడం, ఎన్నికల సంఘం చొరవ తీసుకుని పార్టీని రెండుగా చీల్చడం వరకు మహారాష్ట్రలో ఒక రాజకీయ సంక్షోభం కొనసాగింది. ఇది దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది.