Roja Selvamani : నారాయణ తమ్ముడి భార్య వ్యవహారంపై ఎందుకు నోరు విప్పడం లేదు? పవన్, చంద్రబాబులపై మంత్రి రోజా ఫైర్
చంద్రబాబు ఎన్నికల ఫండ్ కోసం, పవన్ కల్యాణ్ ప్యాకేజీ కోసం నోటికి తాళం వేసుకున్నారా? అని మంత్రి రోజా అడిగారు Roja Selvamani
Roja Selvamani – Chandrababu Naidu : ఏపీ పర్యాటక శాఖ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.. ఛాన్స్ చిక్కితే చాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రశ్నలు, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సవాళ్లతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తాజాగా మరోసారి చంద్రబాబు, పవన్ ను ఉద్దేశించి మంత్రి రోజా తిరుపతిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మహిళల రక్షణ గురించి తెగ బాధపడుతూ పదే పదే మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాజీమంత్రి నారాయణ తమ్ముడి భార్య వ్యవహారం గురించి ఎందుకు నోరు మెదపడం లేదని మంత్రి రోజా ప్రశ్నించారు. తను పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి నారాయణ తమ్ముడి భార్య ప్రియ వీడియోలు పెట్టి ఏడ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రి రోజా నిలదీశారు.
చంద్రబాబు ఎన్నికల ఫండ్ కోసం, పవన్ కల్యాణ్ ప్యాకేజీ కోసం నోటికి తాళం వేసుకున్నారా? అని మంత్రి రోజా అడిగారు. ప్రతి ఇంటికి పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న వాలంటీర్ల గురించి మాట్లాడిన మీరు.. తప్పు చేసిన నారాయణ గురించి ఎందుకు నోరు విప్పడం లేదని మంత్రి రోజా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని నిలదీశారు.
మాజీమంత్రి నారాయణ తనను తీవ్రంగా వేధించారంటూ ఆయన తమ్ముడు భార్య కృష్ణప్రియ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రియ ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్పందించారు. తన భార్య ఆరోగ్యం బాగోలేదని, ఆమె మాటలను పట్టించుకోవద్దని కోరిన విషయం విదితమే.
కాగా.. 29ఏళ్లుగా నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం అలియాస్ మణి తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని కృష్ణ ప్రియ తీవ్ర ఆరోపణలు చేశారు. పెళ్లయిన రెండో రోజు నుంచే తన బావ నారాయణ లైంగిక వేధింపులు మొదలుపెట్టారని వాపోయారు. ఆయనకు లొంగకపోవడంతో వేధింపులు స్టార్ట్ చేశారని, 29 ఏళ్లుగా ఆయన పెట్టే బాధలు భరిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read..KA Paul: మోదీ దగ్గర వీరిని పవన్ కల్యాణ్ తాకట్టుపెడుతున్నారు: కేఏ పాల్
మాజీమంత్రి నారాయణపై ఆయన మరదలు కృష్ణప్రియ చేసిన వేధింపుల ఆరోపణలు చర్చకు దారితీశాయి. అధికార పక్షం నేతలు ఈ వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను టార్గెట్ చేస్తున్నారు.