Pawan Kalyan : ప్రభుత్వం మారగానే కోర్టుల చుట్టూ తిరగాలి, గుర్తుపెట్టుకో- సీఎం జగన్కు పవన్ కల్యాణ్ వార్నింగ్
పారిపోతాను అంటే ఎలా? అలాంటప్పుడు ఓట్లు ఎందుకు వేయించుకున్నావ్? ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటే రాజీనామా చేయ్. తిరిగి ఎన్నికలు పెడతాం. Pawan Kalyan Warns CM Jagan
Pawan Kalyan Warns CM Jagan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ ఉత్తరాంధ్రను దోచేస్తున్నారని పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేపు ప్రభుత్వం మారాక అన్నింటినీ బయటకు తీసుకొస్తామని, నువ్వు కోర్టుల చుట్టూ తిరగాలి, గుర్తుపెట్టుకో అంటూ ముఖ్యమంత్రి జగన్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
విశాఖలో పవన్ కల్యాణ్ మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న సీబీసీఎన్ సీ భూములను, అందులో జరుగుతున్న భనవ నిర్మాణాలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం భూకబ్జాలకు పాల్పడుతోందని పవన్ ఆరోపించారు. క్రిస్టియన్ సంఘాల భూమిని కబ్జా చేశారని చెప్పారు.
Also Read..Galla Family: గల్లా కుటుంబం తరుఫున ఎవరు పోటీ చేసినా ఓకే.. టిక్కెట్ ఇచ్చేందుకు రెడీ!
స్థానిక విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపైనా పవన్ ఫైర్ అయ్యారు. ”ఇక్కడి నుంచి పారిపోతానని ఎంపీ అనడం సిగ్గు చేటు అన్నారు. విశాఖ ప్రజలు ఓటేసి గెలిపిస్తే నువ్వు ఎంపీ అయ్యావు. పారిపోతాను అంటే ఎలా? అలాంటప్పుడు ఎంపీ ఎందుకయ్యావ్? ఓట్లు ఎందుకు వేయించుకున్నావ్? ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటే రాజీనామా చేయ్. తిరిగి ఎన్నికలు పెడతాం” అని పవన్ కల్యాణ్ ఆవేశంగా మాట్లాడారు.
‘ఇటీవల విశాఖ ఎంపీ కుటుంబాన్ని బంధించి, హింసించడానికి కారణం ఈ సీబీసీఎన్ సీ స్థలాలే. భూముల కబ్జా విషయాన్ని క్రిస్టియన్ పోరాట సమితి మా దృష్టికి తెచ్చింది. 3వేల గజాల పైచిలుకు సోషల్ వెల్ఫేర్ స్థలం కబ్జాకు గురి కాకుండా చేశాం. 18వేల గజాల పైచిలుకు చర్చి స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు అడ్డగోలుగా దోచేస్తున్నారు. దీన్ని అడ్డుకోకపోతే ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డు అవుతుంది. స్థలాలన్నీ బయట వాళ్లకు వెళ్లిపోతాయి. ఓయూ విద్యార్థులు తెలంగాణ కోసం నిలబడినట్లు ఏయూ విద్యార్థులు కూడా ఉత్తరాంధ్ర కోసం నిలబడాలి. విశాఖ నుంచి వెళ్లిపోతానని ఎంపీ ఎంవీవీ అంటున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయండి. మళ్లీ ఎన్నికలు వస్తాయి. మీ ప్రైవేట్ వ్యాపారాల కోసమా ఎంపీగా గెలిపించింది? కొత్త ప్రభుత్వం వచ్చాక సీఎం జగన్ కబ్జాలను, అక్రమాలను బయటకు తెస్తాం’ అని పవన్ కల్యాణ్ అన్నారు.