Telangana BJP : దూకుడు పెంచిన బీజేపీ.. మోదీ, అమిత్ షా సహా తెలంగాణలో అగ్రనేతల పర్యటనలు.. షెడ్యూల్ ఇలా
ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గోనుండగా.. కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు నుంచి మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. మరో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలు ఇవాళ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
Modi – Amit Shah : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల అగ్రనేతలు పాల్గొంటున్నారు. మరో నాలుగు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి గడువు ఉండటంతో బీజేపీ దూకుడు పెంచింది. ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గోనుండగా.. కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు నుంచి మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. మరో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలు ఇవాళ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ అగ్రనేతల పర్యటనలకు సంబంధించిన పూర్తి వివరాలు, షెడ్యూల్ ఇలా..
ఇవాళ్టి నుంచి మూడు రోజులు అమిత్ షా పర్యటన..
కేంద్ర మంత్రి అమిత్షా మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్లో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్షా పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, 3 గంటలకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు అంబర్పేట నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో అమిత్ షా పాల్గొంటారు.
– రేపు (25వ తేదీ) 11 గంటలకు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సకల జనుల విజయసంకల్ప సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడులో జరిగే సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు పటాన్చెరు సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్షోకు హాజరవుతారు.
– ఎల్లుండి (26వ తేదీ) తోలుత మక్తల్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారు. మధ్యాహ్నం 1 గంటకు ములుగు, 3 గంటలకు భువనగిరి బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు కూకట్పల్లిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన ఇలా..
బీజేపీ కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్నాథ్ సింగ్ మేడ్చల్కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు కార్వాన్ నియోజకవర్గంలో నిర్వహించే సభలకు హాజరవుతారు. అనంతరం కంటోన్మెంట్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
జేపీ నడ్డా పర్యటన ఇలా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్నగర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోకు హాజరవుతారు. అనంతరం జరిగే బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు. తెలంగాణలో గెలుపుపై పార్టీ శ్రేణులకు జేపీ నడ్డా దిశానిర్దేశం చేయనున్నారు.
మోదీ పర్యటన ఇలా..
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరోసారి రానున్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. మూడు రోజులపాటు పలు చోట్ల నిర్వహించే బహిరంగ సభలతోపాటు రోడ్షోల్లో పాల్గొంటారు.
– రేపు (25వ తేదీ) మధ్యాహ్నం 1.25 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని నరేంద్రమోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్లో కామారెడ్డికి వెళ్తారు. మధ్యాహ్నం 2గంటలకు కామారెడ్డి సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు హైదరాబాద్లోని రాజ్భవన్కు చేరుకుని అక్కడే బస చేస్తారు.
– 26న హైదరాబాద్ శివారులోని కొత్తూరు మండలం చేగూరులోని కన్హా శాంతి వనాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి 2 గంటల 45 నిమిషాల వరకు తూఫ్రాన్ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకు నిర్మల్లో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు హకీంపేట ఎయిర్పోర్టు నుంచి తిరుపతికి వెళ్లి.. రాత్రి అక్కడే బస చేస్తారు.
– 27వ తేదీ ఉదయం 10.30గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబాబాద్ చేరుకుంటారు. అక్కడి సభలో ప్రసంగించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు కరీంనగర్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం ప్రధాని మోదీ హైదరాబాద్లో రోడ్షోలో పాల్గొంటారు. ఆ తరువాత ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.