Tata iPhone Cases : ఐఫోన్ కేసింగ్ తయారీ ప్లాంట్ విస్తరణపై టాటా గ్రూప్ దృష్టి.. 28వేల మంది ఉద్యోగులకు ఉపాధి..!
Tata iPhone Cases : టాటా గ్రూప్ భారత్లోని హోసూర్లో ఐఫోన్-కేసింగ్ తయారీ కేంద్రాన్ని గణనీయంగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్లాంట్ పరిమాణాన్ని రెట్టింపు చేయనుంది. తద్వారా 28వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించనుంది.
Tata iPhone Cases : ప్రముఖ టాటా గ్రూప్ కంపెనీ భారత్లోని హోసూర్లో ఆపిల్ ఐఫోన్-కేసింగ్ తయారీ సౌకర్యాన్ని గణనీయంగా విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ పరిమాణాన్ని మరింత రెట్టింపు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం 500 ఎకరాల్లో ఐఫోన్ కేసింగ్ తయారీ కేంద్రం విస్తరించి ఉంది. ఇందులో 15వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ విస్తరణతో 25వేల నుంచి 28వేల మంది ఉద్యోగుల ఉపాధిని పెంచనుందని అంచనా. దాదాపు రూ. 5వేల కోట్ల పెట్టుబడితో హోసూర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.
జాతీయ నివేదిక ప్రకారం.. టాటా ఎలక్ట్రానిక్స్ కొత్తగా కొనుగోలు చేసిన ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ను ఉపయోగించుకోవడం ద్వారా హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తన సామర్థ్యాలను విస్తరించాలని భావిస్తోంది. ఈ చర్యతో కంపెనీ వృద్ధి పథంలో దూసుకుపోతుందని భావిస్తున్నారు. కొత్త ప్లాంట్ ప్రధానంగా ఆపిల్ ఫోన్ భాగాలను ఉత్పత్తి చేస్తుందని నివేదిక సూచిస్తుంది. అయితే, ఇతర కంపెనీలకు హై-ఎండ్ ఫోన్ల తయారీని కూడా అందిస్తుంది.
దేశీయ మొట్టమొదటి ఐఫోన్ తయారీదారుగా టాటా :
ఈ కొత్త సదుపాయం పూర్తిగా ఆపిల్ ఫోన్ కాంపోనెంట్లకే లోబడి ఉంటుంది. అయితే, ఇతర కంపెనీలు ఇతర హై-ఎండ్ ఫోన్ల కోసం విడిభాగాలను తయారు చేయడానికి కూడా దీనిని ఉపయోగించే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా, కర్నాటకలోని కోలార్ జిల్లాలో విస్ట్రోన్ ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్ను ఇటీవల టాటా గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
దాంతో భారత్లోని మొట్టమొదటి దేశీయ ఐఫోన్ తయారీదారుగా నిలిచింది. ఇప్పుడు ఆ ప్లాంట్ తయారీని విస్తరించడానికి, అందులోని శ్రామిక శక్తిని పెంచడానికి నిర్ణయం టాటా తీసుకుంది. హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో గణనీయమైన విస్తరణకు సిద్ధమవుతున్న తరుణంలో ఆపిల్ విస్తృత వ్యూహంతో స్మార్ట్ఫోన్ తయారీని చైనా నుంచి దూరంగా భారత మార్కెట్లోకి మార్చడానికి సానుకూలంగా ఉందని టెక్నాలజీ మార్కెట్ విశ్లేషకుడు ఒకరు తెలియజేశారు.
భారత్లో ఆపిల్ సరికొత్త రికార్డు :
భారత్లో తయారీ కార్యకలాపాలను స్థాపించాలనే ఆపిల్ నిర్ణయంతో కంపెనీకి కీలకమైన మార్కెట్గా మారనుంది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం ఈ నెల ప్రారంభంలో ఆదాయాల కాల్ సందర్భంగా, జూన్-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్లో కంపెనీ రికార్డు ఆదాయాన్ని హైలైట్ చేశారు.
దేశంలో ఆల్-టైమ్ రెవెన్యూ రికార్డును కలిగి ఉన్నామని, అందుకే ఇదే తమకు ఉత్తేజకరమైన మార్కెట్గా ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్లో ఆపిల్ పనితీరు ఈ ధోరణికి అద్దం పడుతోంది. సంవత్సరానికి 34 శాతం వృద్ధి రేటును చూపుతోంది. అదనంగా, క్యూ3 2023లో, ఆపిల్ ఒక మైలురాయిని సాధించింది. 2.5 మిలియన్ యూనిట్లను అధిగమించడం ద్వారా దేశంలో కొత్త రికార్డును నెలకొల్పింది.
Read Also : Tata AIG Travel insurance : ఎయిర్ ఇండియా ప్రయాణీకుల కోసం టాటా ఏఐజీ ప్రయాణ బీమా.. పూర్తి వివరాలు మీకోసం..!