IND vs ENG 3rd Test : ఇంగ్లాండ్తో మూడో టెస్టుకు ముందు.. భారత్కు మరో షాక్..!
ఇంగ్లాండ్తో మూడో టెస్టు మ్యాచ్కు ముందు టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది.
IND vs ENG : ఇంగ్లాండ్తో మూడో టెస్టు మ్యాచ్కు ముందు టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా తాజాగా కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ సైతం మ్యాచ్ కు అందుబాటులో లేడు. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో రాహుల్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. ఈ క్రమంలో రెండో టెస్టుకు దూరం అయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్లో ఉన్నాడు.
ఇంగ్లాండ్తో మిగిలిన మూడు టెస్టు మ్యాచుల కోసం రెండు రోజుల క్రితం బీసీసీఐ జట్టును ప్రకటించింది. కేఎల్ రాహుల్తో పాటు రవీంద్ర జడేజాకు చోటు ఇచ్చింది. అయితే.. వీరిద్దరు ఫిట్నెస్ సాధిస్తేనే మ్యాచ్కు అందుబాటులో ఉంటారని జట్టును ప్రకటించే సమయంలో బీసీసీఐ తెలిపింది. కాగా.. జడేజా పూర్తి ఫిట్నెస్ సాధించగా రాహుల్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. మరో వారం రోజుల పాటు అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలోనే ఉండనున్నట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Ranji Trophy 2024 : ఇలాంటి మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేయరా..? బీసీసీఐ పై అభిమానుల మండిపాటు
ఈ క్రమంలోనే అతడు రాజ్కోట్ వేదికగా గురువారం ఫిబ్రవరి 15 నుంచి ఆరంభం కానున్న మూడో టెస్టు మ్యాచ్కు అందుబాటులో లేడు. రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్కు అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి ఉంది. కాగా.. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో మూడో టెస్టు మ్యాచ్ కీలకంగా మారింది.
రాహుల్ స్థానంలో..
కేఎల్ రాహుల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ జట్టులోకి రానున్నాడు. ప్రస్తుతం అతడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నాడు. పంజాబ్ పై 193 పరుగులు చేసిన పడిక్కల్ గోవాపై 103, తాజాగా కర్ణాటకపై 151 పరుగులతో సెంచరీల పండగ చేసుకుంటున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన రెండు అనధికార టెస్టుల్లో భారత్ ఏ తరుపున మూడు ఇన్నింగ్స్ల్లో 105, 65, 21 పరుగులు చేశాడు.
రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చినప్పటికీ మూడో టెస్టులో పడిక్కల్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అరంగ్రేటం చేసే అవకాశం ఉంది.