IND vs ENG 3rd Test : రాజ్కోట్లో రప్ఫాడించిన రోహిత్, జడేజా.. భారీ స్కోరు దిశగా భారత్.. ముగిసిన తొలి రోజు ఆట
ఇంగ్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు శతకాలలో చెలరేగారు.
IND vs ENG : ఇంగ్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు శతకాలలో చెలరేగారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమాయానికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(110 నాటౌట్; 212 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల)తో పాటు కుల్దీప్ యాదవ్ (1) లు ఉన్నాడు.
33 పరుగులకే మూడు వికెట్లు..
ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో రాజ్కోట్ టెస్టు మ్యాచ్ కీలకంగా మారింది. ఈ కీలక మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కు అనుకూలమైన రాజ్కోట్ పిచ్ పై ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ తొలి గంటలో భారత బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. యశస్వి జైస్వాల్ (10), శుభ్మన్ గిల్ (0) లను తన వరుస ఓవర్లలో మార్క్వుడ్ పెవిలియన్కు చేర్చగా రజత్ పాటిదార్ (5) ను టామ్హార్డ్లీ ఔట్ చేశాడు. దీంతో భారత్ 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో భారత్ బ్యాటింగ్ ఎంచుకుని తప్పు చేసిందా అనే అనుమానం కలిగింది. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ (131; 196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఆరంభంలో వీరిద్దరు క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. క్రీజులో కుదురుకున్న తరువాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. రోహిత్ శర్మ తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించారు. వీరిద్దరు ఇంగ్లాండ్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 157 బంతుల్లో రోహిత్ శర్మ టెస్టుల్లో తన పదకొండో సెంచరీని నమోదు చేశాడు.
జడేజా సెంచరీ..
ఆ తరువాత కూడా రోహిత్ అదే జోరును కొనసాగించాడు. ప్రమాదకరంగా మారిన వీరి జోడిని మార్క్వుడ్ విడగొట్టాడు. సెంచరీ చేసి ఊపుమీదున్న రోహిత్ శర్మను ఔట్ చేశాడు. రోహిత్-జడేజాలు నాలుగో వికెట్కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ ఔటైనా తరువాత అరంగ్రేట ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (62; 66 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్స్) తో కలిసి జడేజా ఇన్నింగ్స్ను కొనసాగించాడు.
David Warner : ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును చిన్నారికి ఇచ్చిన వార్నర్.. ఎందుకో తెలుసా?
తొలి మ్యాచే అయినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ ఎలాంటి బెదరులేకుండా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్ పేసర్లు, సిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన అతడు 48 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత మరింత వేగంగా బ్యాటింగ్ చేశాడు. అయితే.. జడేజాతో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు.
మరోవైపు తనదైన శైలిలో ఆడిన రవీంద్ర జడేజా సైతం 198 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జడేజాకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. కుల్దీప్ యాదవ్తో కలిసి జడేజా మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్వుడ్ మూడు వికెట్లు తీయగా టామ్ హార్డ్లీ ఓ వికెట్ పడగొట్టాడు.