Paytm Payments Bank : మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘన.. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రూ.5.49 కోట్ల జరిమానా..!
Paytm Payments Bank : మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా రూ.5.49 కోట్ల జరిమానా విధించింది.
Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు మళ్లీ షాక్ తగిలింది. మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘన కేసులో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) రూ.5.49 కోట్ల జరిమానా విధించింది. ఆన్లైన్ జూదంతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల విషయంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ద్వారా నిర్వహించే అకౌంట్లకు సంబంధించి నిర్దిష్ట సమాచారాన్ని ఎఫ్ఐయూ అందుకుంది. ఈ సమాచారం ఆధారంగా రివ్యూ చేసిన అనంతరం పేటీఎంపై భారీగా జరిమానా విధించింది. ఆ సొమ్మును ఆయా సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు నిర్వహించే అకౌంట్ల నుంచి పంపుతున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
మార్చి 15 వరకు గడువు పొడిగింపు :
మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనలు ఉల్లంఘించినట్టుగా గుర్తించిన ఎఫ్ఐయూ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రూ.5.49 కోట్ల పెనాల్టీ విధించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఫిబ్రవరి 15నే ఎఫ్ఐయూ ఈ ఉత్తర్వులను వెలువరించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 29 నుంచి కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా ఉండేందుకు ఆర్బీఐ జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై నిషేధం విధించింది. అనంతరం ఆర్బీఐ ఈ పరిమితిని మార్చి 15 వరకు పొడిగించింది.
అదే క్రమంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై భారీ జరిమానా విధించింది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా పేటీఎం నోడల్ అకౌంట్లను యాక్సిస్ బ్యాంక్కి మార్చేసింది. క్యూఆర్ కోడ్లు, కార్డ్ మెషీన్లు, సౌండ్బాక్స్ వంటి సర్వీసులు సక్రమంగా పనిచేసేలా చేయాలని ఆర్బీఐపై కోరింది. కానీ, ఆర్బీఐ ఈ విషయంలో కొంత వెసులుబాటును కల్పించింది.
గడువు తేదీ తర్వాత కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ టూల్స్, వ్యాలెట్లు, ఫాస్ట్ట్యాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్లలో డిపాజిట్ లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్లు అనుమతించమని ఆర్బీఐ స్పష్టంచేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లను వాడే వినియోగదారులు తమ వ్యాలెట్ల నుంచి నగదును విత్డ్రా చేసుకోవచ్చు. మార్చి 15 తర్వాత కొత్తగా నగదును క్రెడిట్ చేయలేరు. పేటీఎం ఫాస్ట్ట్యాగ్లను మార్చి 15 తర్వాత రీఛార్జ్ చేయలేరని ఆర్బీఐ పేర్కొంది.