అతడి వల్లే రస్సెల్ అన్ని పరుగులు బాదాడు: సునీల్ గవాస్కర్ కామెంట్స్
మ్యాచులో కోల్కతా టాప్ ఆర్డర్ అంతగా రాణించకపోయినప్పటికీ జట్టుకు రస్సెల్ భారీ స్కోరు అందించాడని తెలిపారు.
ఐపీఎల్-2024లో భాగంగా నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్పై కోల్కతా నైట్రైడర్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో కోల్కతా ప్లేయర్ ఆండ్రి రస్సెల్ 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపర్చాడు.
మొత్తం 25 బంతుల్లో అతడు 64 పరుగులు (నాటౌట్) చేశాడు. అయితే, అతడి అత్యద్భుత ప్రదర్శన ఘనత అంతా గౌతం గంభీర్దేనంటూ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పలు వ్యాఖ్యలు చేశారు. కోల్కతా నైట్రైడర్స్ మెంటార్గా గౌతం గంభీర్ ఉన్నారు.
ఓ ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. మ్యాచులో కోల్కతా టాప్ ఆర్డర్ అంతగా రాణించకపోయినప్పటికీ జట్టుకు రస్సెల్ భారీ స్కోరు అందించాడని తెలిపారు. గౌతం గంభీర్ ఇప్పుడు మళ్లీ మెంటార్గా వచ్చిన సమయంలో కోల్కతాకు అందించిన మొదటి విజయం ఇదేనని చెప్పారు. గత ఐపీఎల్ సీజన్ లో రస్సెల్ అంతగా ఆడలేదని అన్నారు.
ఇప్పుడు అతడి నుంచే మంచి ప్రదర్శనను చూశామని చెప్పారు. అన్ని మ్యాచుల్లో రస్సెల్ ఇలాగే ఆడాలని అన్నారు. ఇతర మ్యాచుల్లో అతడు విఫలమైతే గంభీర్ను నిందించడానికి కొందరు రెడీగా ఉంటారని చెప్పారు. స్లో యార్కర్లను భువనేశ్వర్ వంటి వారు అద్భుతంగా వేస్తారని తెలిపారు. ఈ మ్యాచులో లెగ్ సైడ్ బౌలింగ్ వేయడంతో రస్సెల్ సులువుగా స్కోరు బాదాడని చెప్పారు.