Mango Farmers Problems : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నా, మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు నష్టపోతున్నారు. ఆరేళ్ల క్రితం బెల్లంపల్లిలో చేపట్టిన నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో.. మామిడి కాయలను అమ్ముకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఏటా మహారాష్ట్రలోని నాగ్పూర్ మార్కెట్పైనే ఆధారపడుతూ.. అక్కడ కమీషన్ ఏజెంట్ల చేతిలో నిలువుదోపిడీకి గురవుతున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు మామిడి మార్కెట్ను ప్రారంభిస్తామని చెప్పడమే తప్ప ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేని విధానాలతో బెల్లంపల్లిలోని మామిడి కొనుగోలు కేంద్రం ఏరపాటులో జాప్యం జరుగుతోంది. ఆరేళ్ల క్రితం స్థలం కేటాయించి రెండు షెడ్లు నిర్మించినప్పటికీ మామిడి పండ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకాక షెడ్లు నిరుపయోగంగా మారింది.
READ ALSO : Mango Farming : మామిడిలో కాయ,పిందె దశలో చేపట్టాల్సిన యాజమాన్యచర్యలు!
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, నెన్నెల, తాండూర్, భీమిని, చెన్నూర్ నియోజక వర్గంలోని చెన్నూర్, కోటపల్లి, భీమారం మండలాల్లో మామిడి తోటలు విస్తారంగా ఉన్నాయి. ఈ జిల్లాలో మామిడి పండ్ల కొనుగోలు కేంద్రం అందుబాటులో లేకపోవడంతో ఏటా ఇక్కడి రైతులు మహారాష్ట్రలోని నాగ్పూర్, చంద్రపూర్లలో విక్రయిస్తారు. మార్కెట్ లో దళారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలో సుమారు 12వేల ఎకరాల్లో, చెన్నూరు నియోజకవర్గం పరిధిలో 15వేల ఎకరాల్లో, మంచిర్యాల నియోజకవర్గం పరిధిలో 5వేల ఎకరాల్లో మామిడి పంట సాగు అవుతోంది. చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని భీమారంలో మామిడితోటలతో పాటు నర్సరీలు కూడా విస్తరించి ఉన్నాయి. నర్సరీలలో పెంచే మామిడి మొక్కల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి మామిడి రైతులు వచ్చి మొక్కలను కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు.
READ ALSO : Mango Plantations : మామిడి తోటల్లో కలుపు నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !
మామిడి పంటకు రాష్ట్రంలోనే భీమారం ప్రాంతానికి మంచి పేరు ఉంది. మార్కెట్ మంజూలై సంవత్సరాలు గడిచినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న జిల్లా రైతులు. ఈ విషయాన్నిబెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అసెంబ్లీలో కూడా ప్రస్థావించారు.