Vegetable Crops : కూరగాయ పంటల్లో నీటి యాజమాన్యం

నాటిన వెంటనే నీరు కట్టాలి. నల్లరేగడి నేలల్లో 10 రోజులకు ఒకసారి, తేలిక నేలల్లో 6 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. గడ్డలు కోతకు వచ్చే 5 రోజుల ముందు నీరు పెట్టడం అపేయాలి. నీటిని ఎక్కువ ఇస్తే గడ్డలు పగిలే అవకాశం ఉంటుంది.

Vegetable Crops : కూరగాయ పంటల్లో నీటి యాజమాన్యం

Vegetable Crops (1)

Vegetable Crops : మొక్కలకు నీరు ప్రాణాధారమైనది. ముఖ్యంగా రైతులు సాగుచేసే పంటలకు అవసరానికి తగ్గట్టు నీటిని అందిస్తే మొక్కల ఎదుగుదల బాగుండటంతోపాటు మంచి దిగుబడి, నాణ్యత పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కూరగాల సాగుచేస్తున్న రైతులు సకాలంలో నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పంటల వారిగా వాటికి సరైన సమయంలో నీటిని అందించటం చాలా ముఖ్యం. కొన్ని రకాల కూరజాతి పంటల్లో నీటి యాజమాన్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

మిరప ; ఈ పంట అధిక తేమను, బెట్టను తట్టుకోలేదు. తేమ పెరిగితే పూత రాలుతుంది. తెగుళ్లు ఆశించి దిగుబడులు తగ్గుతాయి. బెట్టకు గురైనప్పుడు పూత రాలడంతోపాటు కొత్త రెమ్మలు ఏర్పడవు. నల్ల రేగడి నేలల్లో 3వారాలకు ఒకసారి , తేలిక నేలల్లో 15 రోజులకు ఒక సారి , వేసవి
పంటలో 6 రోజులకు ఒకసారి నీరు అందించాలి.

వంగ ; నారు నాటే ముందు లేదా నాటిన తరువాత నీటిని ఇవ్వాలి. నేలలో తేమను బట్టి వారానికి ఒక సారి వేసవిలో 4 రోజులకొకసారి తడి ఇవ్వాలి. పూత,కాత దశలో నేలలో తేమ ఉండాలి. లేదంటే పూత రాలుతుంది. వేసవిలో కాయ కోతకు ఒక రోజు ముందు నీటి తడి ఇవ్వాలి. లేదంటే కాయలో చేదు పెరుగుతుంది.

టమోటా; టమోటా సాగు చేసే రైతులు వేసవిలో పంటను కాపాడుకునేందుకు సకాలంలో నీటి తడులు ఇవ్వటం అవసరం. వారానికి ఒకసారి నీటి తడులు ఇవ్వటం వల్ల పంటను కాపాడుకోవచ్చు. మంచి దిగుబడి వస్తుంది.

ఉల్లి ; ఉల్లికి తరుచుగా నీరు అందిస్తుండాలి. నారు దశలో వారం వ్యవధిలో రెండు సార్లు నీరు ఇవ్వాలి. తరువాత 60 రోజుల వరకు 12 రోజులకు ఒకసారి నీరు అందించాలి. గడ్డ ఊరే సమయంలో 7 రోజుల వ్యవధిలో 7 తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజుల ముందు నీరు ఇవ్వటం ఆపాలి. ఖరీఫ్ లో 8, రబీలో 12, వేసవిలో 15 సార్లు నీటితడులివ్వాలి. గడ్డ పెరిగే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్ ; నాటిన వెంటనే నీరు కట్టాలి. నల్లరేగడి నేలల్లో 10 రోజులకు ఒకసారి, తేలిక నేలల్లో 6 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. గడ్డలు కోతకు వచ్చే 5 రోజుల ముందు నీరు పెట్టడం అపేయాలి. నీటిని ఎక్కువ ఇస్తే గడ్డలు పగిలే అవకాశం ఉంటుంది. ఈ రెండు పంటలకు నీటిని ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది.

చిక్కుడు ; పందిరి రకాలకు పాదులో మట్టి 3 సెంటీమీటర్ల లోతులో ఎండినప్పుడు నీరు ఇవ్వాలి. పాదుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. చిక్కుడ, గోరుచిక్కుడు కొంతవరకు నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. ఫ్రెంచి చిక్కుడు అధిక తేమను, నీటి ఎద్దడిని తట్టుకోలేవు. 7 నుండి 10 రోజుల కొకసారి నేల స్వభావాన్ని బట్టి నీరు అందించాలి.

క్యారెట్ ; నేల స్వభావం, వాతావరణం పరిస్ధితులను బట్టి 7 రోజుల కు ఒకసారి నీరు అందించాలి. దుంప పెరుగుదల దశలో తగినంత తేమ ఉండాలి. ఆకులు వాడినట్లు కనపడక ముందే నీరు అందించాలి. అవసరానికి మించి నీరు ఇవ్వారాదు. దీనివల్ల వేరు పెరుగుదల తగ్గుతుంది. తేమ ఎక్కవగా ఉంటే క్యారెట్ నాణ్యతపై ప్రభావం పడుతుంది.