కర్ణాటక నుంచి చిత్తూరుకు కూలీలు, వలస కార్మికులు.. 1500 మంది క్వారంటైన్కు తరలింపు
కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా బాధితులను గుర్తించేందుకు ఏపీ కూడా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. రాష్ట్రంలోకి ఎవరిని అనుతించడం లేదు. ఎవరైనా సరిహద్దుల్లోకి ప్రవేశిస్తే వారిని క్వారంటైన్ కు తరలిస్తోంది. ఏపీ రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చేవారందరిని అక్కడి అధికారులు ఆపివేస్తున్నారు. కర్ణాటక నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు సరిహద్దుకు వేలాదిమంది కూలీలు, వలస కార్మికులు తరలివచ్చారు.
దాంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం దాదాపు 1500 మంది వరకు ఉన్న వీరందరిని క్వారంటైన్ కు తరలించింది. కూలీలు, వలస కార్మికుల కోసం సమీపంలోని భవనాలను గుర్తించి వారికి అక్కడే భోజనం, వసతి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. త్వరలో వీరికి వైద్య పరీక్షలను నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలను చేపట్టనుంది. మరోవైపు ఏపీలో ఇప్పటివరకు 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
విదేశాల నుంచి 28వేల మంది ఏపీ రాష్ట్రానికి వచ్చారు. సుమారు 28వేల మంది విదేశీయులు, ఎన్నారైలను గుర్తించారు. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. వంద పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో 200 పడకలతో కరోనా ఆస్పత్రి ఏర్పాట్లు చేస్తోంది.