ఏపీలో శానిటైజర్ టెర్రర్ : నిన్న ప్రకాశంలో 10 మంది..నేడు కడపలో ముగ్గురు మృతి

  • Published By: madhu ,Published On : August 3, 2020 / 10:16 AM IST
ఏపీలో శానిటైజర్ టెర్రర్ : నిన్న ప్రకాశంలో 10 మంది..నేడు కడపలో ముగ్గురు మృతి

ఏపీ రాష్ట్రంలో శానిటైజర్ తాగుతూ…చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి రక్షించుకొనేందుకు ఉపయోగిస్తున్న శానిటైజర్ మత్తుకు ఉపయోగిస్తున్నారు కొంతమంది. మత్తుకు బానిసైన కొంతమంది..దీనిని నీళ్లలో కలుపుకుని తాగి ప్రాణాలు వదులుతున్నారు.



ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజ్ తాగి 10 మంది మృతి చెందిన ఘటన మరిచిపోకముందే..కడపలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు చనిపోయారు. ఇదే గ్రామంలో మరో 10 మంది శానిటైజర్ సేవించినట్లు తెలుస్తోంది. కురిచేడు ఘటన తర్వాత..మందుబాబుల్లో మార్పు రావడం లేదు.

ఇది తాగడం వల్ల చనిపోతామని తెలిసినా..వారు పట్టించుకోవడం లేదు. ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడం వల్ల..అంత డబ్బు పెట్టి కొనలేకపోతున్న వారు శానిటైజ్ సేవిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకెంత మంది బాధితులు ఉన్నారనే విషయం తెలియడం లేదు.



పెరిగిన మద్యం ధరలు మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంత డబ్బు పెట్టి మద్యం కొనలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదే కోవలో మద్యానికి బదులుగా స్పిరిట్, శానిటైజర్లు తాగి ఏపీలో ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రకాశం జిల్లాలో లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దుకాణాలు మూసివేశారు. దీంతో మందుబాబులు దిక్కుతోచని పరిస్థితుల్లో మత్తు కోసం శానిటైజర్లను నీటిలో కలుపుకొని తాగుతున్నారు. కురిచేడులో శానిటైజర్‌ సేవించి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.

కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగిస్తున్న శానిటైజర్లను మత్తు కోసం కొంతమంది వాడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం స్పిరిట్, శానిటైజర్లను సేవించడం ప్రాణాంతకమని, అలాగే మద్యానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తోంది.