పెళ్లికొడుక్కి కరోనా, ఆందోళనలో పెళ్లికొచ్చిన 500మంది, కొవిడ్ పరీక్షలు చేయించుకునేందుకు క్యూ

  • Published By: naveen ,Published On : August 17, 2020 / 03:39 PM IST
పెళ్లికొడుక్కి కరోనా, ఆందోళనలో పెళ్లికొచ్చిన 500మంది, కొవిడ్ పరీక్షలు చేయించుకునేందుకు క్యూ

విశాఖ జిల్లాలో ఓ నవ వరుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడా పెళ్లికి హాజరైన వారంతా టెన్షన్ పడుతున్నారు. వారందరికి కరోనా భయం పట్టుకుంది. కోటవురట్ల మండలం కొడవటిపూడికి చెందిన యువకుడు రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి పెళ్లి నిశ్చయం కావడంతో 20 రోజుల క్రితం సొంత ఊరికి వచ్చాడు. అతడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆగస్టు 5న వీఎల్‌ఎం కిట్‌తో కోవిడ్‌ పరీక్ష చేసి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి శాంపిల్ పంపించారు. ఫలితాలు రావడం ఆలస్యమైంది. ఈలోపే పెద్దలు అనుకున్న ముహూర్తానికి ఆగస్టు 15న రావికమతంకు చెందిన యువతితో వివాహం జరిపించారు.



వరుడికి కరోనా సోకినట్టు నిర్ధారణ:
ఆ తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్టు, నవ వరుడికి కరోనా సోకినట్టు డాక్టర్లు నిర్ధారించారు. అంతే ఒక్కసారిగా కలకలం మొదలైంది. పెళ్లికి హాజరైన వారంతా షాక్ తిన్నారు. కరోనా భయంతో వణుకుతున్నారు. ఊరి చర్చిలో జరిగిన వివాహానికి పాస్టర్ తో పాటు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు 90మంది పాల్గొన్నారు. అలాగే ఇంటి దగ్గర పెట్టిన భోజనాల్లో సుమారు 500 మందికిపైగా పాల్గొన్నారట.



గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకుంటున్నారు:
పెళ్లి కొడుక్కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వివాహానికి హాజరైన వారిలో టెన్షన్‌ మొదలైంది. తమకు కరోనా సోకిందేమోనని వణికిపోతున్నారట. పెళ్లికి వచ్చిన వారంతా ఇప్పుడు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునే పనిలో పడ్డారు. కరోనా కొంప ముంచుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. పెళ్లిళ్లు, ఇతర వేడుకల్ని కూడా సాధ్యమైనంత వరకు తక్కువ మందితో జరుపుకోమని ప్రభుత్వాలు నెత్తీనోరు బాదుకుని మరీ చెప్పినా కొందరు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గొప్పలకు పోయి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. వారితో పాటు అందర్నీ టెన్షన్ పెడుతున్నారు.