వైద్యుల మాయ : డెలివరీ చేశారు..కడుపులో బిడ్డ లేదంటున్నారు

వైద్యుల మాయ : డెలివరీ చేశారు..కడుపులో బిడ్డ లేదంటున్నారు

A strange incident in the Tirupati Government Maternity Hospital : తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వెళ్తే బిడ్డను మాయం చేశారు. డెలివరీ చేసిన వైద్యులు కడుపులో బిడ్డ లేదంటున్నారు. శశికళ అనే మహిళ కాన్పు కోసం రెండు రోజుల క్రితం తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వెళ్లింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగనెల్లూరుకు చెందిన శశికళకు నిన్న డెలివరీ డేట్ ఇచ్చి అడ్మిట్ చేసుకున్నారని బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. తమ బిడ్డను మాయం చేసి తమపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు.

అయితే అసలు శశికళ కడుపులో బిడ్డే లేదని, తమను మోసం చేస్తున్నారంటూ ఆస్పత్రి వైద్యులు.. శశికళను, ఆమె భర్త సురేశ్‌ను పోలీసులకు పట్టించారు. శశికళకు తొమ్మిది నెలలు నిండాయని.. గ్రామంలో శ్రీమంతం కూడా జరిపామని కుటుంబీకులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా విడుదల చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. అసలు శశికళ గర్భం దాల్చిందా లేదా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. శశికళ పాత రిపోర్ట్‌లను పరిశీలిస్తున్నామని.. బాధితులు ఏ ఆస్పత్రికి తీసుకెళ్లమంటే అక్కడి తీసుకెళ్లి మళ్లీ వైద్యపరీక్షలు నిర్వహిస్తామంటున్నారు.

తిరుపతి శశికళ వ్యవహారంపై అధికారులు స్పందించారు. 10టీవీ వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. శశికళకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. నగరంనలోని ఓ ప్రైవేట్‌ మహిళా ఆస్పత్రికి శశికళను తరలించారు. అక్కడే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శశికళ గర్భం దాల్చిందా .. లేదా .. అన్న అనుమానాలకు కాసేపట్లో సమాధానం లభించనుంది.

శశికళ అంతకముందు పిల్లల కోసం నెల్లూరు జిల్లా గూడూరులోని మైథిలీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. అయితే శశికళకు గర్భం రాలేదని… పిల్లల కోసమే తన దగ్గరకు వచ్చారని మైథిలీ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ మైథిలీ తెలిపారు. తమ దగ్గరికి వచ్చినప్పుడు తాను ఐదు నెలల గర్భవతినని చెప్పిందని.. పరీక్షలు నిర్వహించగా ఆమెకు గర్భం లేదని తేలిందన్నారు.