Vijayanagaram : పెళ్లి చేసుకోబోయే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న ఓ కిరాతకుడు.. ఆ యువతిపైనే పెట్రోల్ దాడి చేశాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
young man attack young woman : విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న ఓ కిరాతకుడు.. ఆ యువతిపైనే పెట్రోల్ దాడి చేశాడు. పూసపాటిరేగ మండలం చౌడువాడలో యువతిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాడిని ఆపేందుకు ప్రయత్నించగా బాధితురాలి సోదరి, ఆమె నాలుగేళ్ల కుమారుడు కూడా గాయపడ్డారు.
స్థానికులు బాధితులు ముగ్గురిని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారవ గ్రామానికి చెందిన డ్రైవర్ రాంబాబుగా భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం రాంబాబు, బాధిత యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇరు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి అంగీకరించాయి. ఆ తర్వాత ప్రతి రోజు ఆమె ఇంటికి రాత్రి వేళ వచ్చి కలిసి వెళ్తుండే వాడు. అయితే ఇటీవల ఆ యువతి వేరే యువకుడితో మాట్లాడుతోందంటూ రాంబాబు అనుమానించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమెను పెళ్లి చేసుకొనేందుకు అంగీకరించలేదు.
పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు తెలిపాడు. దీనిపై ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు కుటుంబాలను పోలీసులు పిలిపించి, రాజీ కుదిర్చారు. చివరకు పోలీసుల సూచనతో వివాహం చేసుకునేందుకు రాంబాబు అంగీకరించాడు.
కానీ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ యువతి ఇంటికి వెళ్లి, నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలపై పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.