Thadepalli Rape Case: తాడేపల్లి అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్ వద్ద జరిగిన అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.
Thadepalli rape case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్ వద్ద జరిగిన అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. యువతి నుంచి దోచుకెళ్లిన సెల్ఫోన్ ఆధారంగా నిందితుల ఆచూకీ కనుగొన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత ధ్రువీకరించారు.
యువజంట వద్ద నిందితులు దోచుకెళ్లిన సెల్ఫోన్ను తాడేపల్లికి చెందిన తాపీమేస్త్రీకి అమ్మగా.. స్విచ్ఛాప్లో ఉన్న ఫోన్ను మంగళవారం ఆన్ చేయగానే లొకేషన్ ద్వారా పోలీసులు కనిపెట్టారు. ఫోన్ వినియోగిస్తున్న మహిళను విచారించగా.. విజయవాడలో ఎవరో తన భర్తకు విక్రయించారని వెల్లడించింది. ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్ వద్ద జూన్ 19వ తేదీ రాత్రి నర్సింగ్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నిందితులను సీతానగరానికి చెందిన కృష్ణ, వెంకటేశ్గా గుర్తించారు. వీరిద్దరిని బాధితురాలు గుర్తుపట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వీరు గతంలో కూడా ఎంతోమంది జంటలపై క్రూరంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్లో ఉన్న మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇప్పటికే దొరికిన యువకులిద్దరూ రైలు బోగీల్లోని తలుపులు, కిటీకీల వద్ద కూర్చునే ప్రయాణికుల నుంచి సెల్ఫోన్లు, మెడలోని గొలుసులను లాక్కొని పోతుంటారని చెబుతున్నారు. వాటిని అమ్మగా వచ్చే డబ్బుతో మద్యం, గంజాయి తాగుతుంటారని తెలుస్తుంది. వారిద్దరూ రైల్వే ట్రాక్ వెంబడి ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళతారని, ఏదైనా పెద్ద నేరం చేసినప్పుడు రెండు మూడు నెలల వరకు కనిపించకుండా తిరుగుతారని చెబుతున్నారు.