ఆధారాల్లేకుండా కారం చల్లాడు, క్షుద్రపూజలు జరిగినట్లు సీన్ క్రియేట్ చేశాడు, లా తెలివితేటలను హత్యకు వాడాడు.. వరలక్ష్మి కేసులో సంచలన నిజాలు
gajuwaka varalakshmi murder case: విశాఖ జిల్లా గాజువాకలో ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి(17) హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ను తలపించేలా అఖిల్ వరలక్ష్మి మర్డర్కు ప్లాన్ చేశాడు. పక్కా ప్రణాళికతో వరలక్ష్మిని చంపి కేసు తనపై రాకుండా ఉండేలా వ్యవహరించాడు. హత్య అనంతరం ఆ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి.. పోలీసులను ఎలా తప్పుదోవ పట్టించాలనే కోణంలో వ్యూహం సిద్ధం చేశాడు అఖిల్.
లా చదివిన నిందితుడు తన తెలివిని నేర స్వభావానికి వాడుకున్నాడు. నమ్మి వచ్చిన యువతిని అతి కిరాతకంగా చంపేశాడు. హత్య జరిగిన ప్రాంతంలో క్షుద్రపూజలు జరిగినట్లు సీన్ క్రియేట్ చేశాడు. పోలీసులే ఆశ్చర్యపోయేలా మర్డర్ ప్లాన్ ప్రిపేర్ చేశాడు అఖిల్.
పోలీసులే ఆశ్చర్యపోయేలా మర్డర్ ప్లాన్:
వరలక్ష్మిని హత్య చేసిన ప్రాంతమైన సాయిబాబా ఆలయానికి ప్రహరీ గోడ ఉంది. ఆ గోడ అవతలివైపు యువతిని కత్తితో పొడిచి హత్య చేశాడు అఖిల్. వరలక్ష్మీ రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉండగా… ఆధారాలు లేకుండా చేయడానికి తనతో తెచ్చుకున్న కారాన్ని ఆ ప్రదేశంలో చల్లాడు. అక్కడ హత్య కాదు క్షుద్రపూజలు జరిగినట్లు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు.
హత్యపై వివిధ అనుమానాలు రేకెత్తించడానికి రామ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నట్లు పోలీసులకు కథ అల్లాడు. ఆ సమాచారం బయటకు రావడంతో రామ్, వరలక్ష్మి కలిసి ఉన్న సమయంలో తాను వచ్చి దాడి చేశాడని అంతా భావించేలా చేశాడు. నిందితుడిని తమ స్టైల్లో విచారణ జరిపిన పోలీసులు అందులో ఏమాత్రం నిజం లేదని గుర్తించారు.
https://10tv.in/key-matter-out-in-varalakshmis-case/
మరోవైపు విశాఖ జిల్లా గాజువాకలో వరలక్ష్మీ హత్య జరిగిన ప్రాంతాన్ని మహిళ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పరిశీలించింది. వరలక్ష్మీ హత్య కేసులో తమకు అనుమానాలు ఉన్నాయని.. పౌర్ణమి కావడంతో అక్కడ క్షుద్ర పూజలు జరిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు కమిటీ సభ్యులు. పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ లో వరలక్ష్మీకి చెందిన వస్తువులు భద్రపరిచినట్లు తమకు అనిపించడం లేదన్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కేసులో నిందితుడు అఖిల్ సాయికి నవంబర్ 12 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఇవాళ(నవంబర్ 2,2020) ఉదయం నిందితుడ్ని కోర్టు ముందు హాజరుపర్చగా నిందితుడికి రిమాండ్ విధించింది. దీంతో అఖిల్ సాయిని జైలుకి తరలించారు పోలీసులు.
ప్రేమ పేరుతో వేధింపులు:
ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసిన వరలక్ష్మికి, లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న అఖిల్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ఆమెకు దగ్గరైన అఖిల్.. ప్రేమ పేరుతో వేధించేవాడు. రెండు రోజుల క్రితం సాయిబాబా గుడి దగ్గర వరలక్ష్మితో అఖిల్ గొడవపడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో వరలక్ష్మి గొంతు కోశాడు. ఆ తర్వాత మెట్లు దిగి వస్తున్న అఖిల్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొన ఊపిరితో ఉన్న వరలక్ష్మిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వరలక్ష్మి మృతి చెందింది.