Andhra Pradesh Cabinet : కుటుంబానికి 10వేలు, రిజర్వేషన్లు పెంపు, 18ఏళ్లు దాటిన వారికి ఆ తర్వాతే వ్యాక్సిన్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ సహా పలు కీలక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్నినాని మీడియాకు తెలిపారు.

Andhra Pradesh Cabinet : కుటుంబానికి 10వేలు, రిజర్వేషన్లు పెంపు, 18ఏళ్లు దాటిన వారికి ఆ తర్వాతే వ్యాక్సిన్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Andhra Pradesh Cabinet Key Decisions

Andhra Pradesh Cabinet Key Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ సహా పలు కీలక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్నినాని మీడియాకు తెలిపారు.

రాష్ట్రంలో కరోనా కట్టడి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం(మే 5,2021) నుంచి మధ్యాహ్నం 12గంటల తర్వాత పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత అన్నీ బంద్ కానున్నాయి. అంతేకాదు ఆర్టీసీ బస్సులు కూడా బంద్ కానున్నాయి. ప్రజా రవాణాతో పాటు, ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత అంతర్రాష్ట్ర, దూర ప్రాంత బస్సులు పూర్తి నిలిపివేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు:
* రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ అమలుకు ఆమోద ముద్ర
* మధ్యాహ్నం 12 తర్వాత అన్నీ బంద్
* మే 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ, సహా ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిషేధం. అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల సేవలు కూడా రద్దు
* కడప స్టీల్‌ ప్లాంట్‌ను ఎస్సార్‌ స్టీల్స్‌కు అప్పగించాలని కేబినెట్‌ నిర్ణయం
* కృష్ణపట్నం పోర్టులో మౌలిక వసతులకు రూ.1448 కోట్లు మంజూరుకు పచ్చజెండా
* కైలాసగిరి- భోగాపురం మధ్య ఆరు లైన్ల రోడ్డు వేయడంతో పాటు ఐదెకరాల్లో స్కైటవర్స్ నిర్మాణం‌, 11 బీచ్‌ల అభివృద్ధికి ఆమోద ముద్ర
* పల్నాడు కరవు నివారణకు రూ.2740 కోట్లు రుణం తీసుకొనేందుకు ఆమోదం
* ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి ఆక్సిజన్‌ రప్పించేందుకు చర్యలు.

* బీసీల రిజర్వేషన్లు మరో పదేళ్లు పెంపు.
* ఈ నెల 13న రైతు భరోసా తొలి విడత జమ. 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4వేల 40 కోట్లు జమ. మే 25న 38లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,805 కోట్లు జమ.
* వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద కుటుంబానికి రూ.10వేలు పరిహారం. 2021 మే 18న మరో 1లక్షా 460మందికి అందజేత.
* రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ. గత ప్రభుత్వ బకాయిలు పెట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందజేత.

* ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ ద్వారా విద్యా బోధన. 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలో చదువుకుని, పరీక్ష రాస్తారు. రాష్ట్రంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం అమలు.
* 2018-19 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 52,23,000 విద్యార్థులు ఉంటే, 2020-21 సంవత్సరానికి ఆ సంఖ్య 59,30,000 చేరింది.
* నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.
* ఎయిడెడ్‌ కాలేజీలను ప్రభుత్వానికి అప్పగించాలని ప్రతిపాదన, లేదంటే పూర్తిగా ప్రైవేటుగా నిర్వహించుకోవాలి.

* ఏపీలో మూసేసిన సహకార డెయిరీలను అమూల్‌కు లీజుకిస్తున్నాం. మొత్తం 708 గ్రామాల్లో అమూల్‌ సేవలు
* అర్చకులకు రూ.10వేల నుంచి రూ.15వేల గౌరవ వేతనం పెంపు. బి కేటగిరి ఆలయాల్లో రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం
* ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం పెంపు. మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేల గౌరవ వేతనం
* 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాతే 18-44ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయం.

* పోలవరం ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ నుంచి నీళ్లు తోడేందుకు లిఫ్ట్ నిర్మాణం. హంద్రనీవా ఫేజ్‌-1, ఫేజ్‌-2 పనులకు నిధులు మంజూరు
* ప్రైవేటు వర్సిటీ చట్టం మారుస్తూ మంత్రివర్గ నిర్ణయం. ప్రైవేటు వర్సిటీల్లో 35శాతం సీట్లు ప్రభుత్వానికి కేటాయించేలా చట్టంలో మార్పు.