3వేల 795 వీఆర్వో పోస్టుల భర్తీకి ఏపీ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 3వేల 795 గ్రామ రెవెన్యూ అధికారుల (VRO)గ్రేడ్ –2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్వో (గ్రేడ్–2) పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) లుగా పనిచేస్తున్న అర్హులకు వన్టైమ్ ప్రాతిపదికన వీఆర్వోలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియేషన్లు విజ్ఞప్తులు చేశాయి.
వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఐదు నెలల కిందటే ఓ నిర్ణయం తీసుకుంది. 3,795 వీఆర్వో పోస్టులను ఇంటర్మీడియెట్ తత్సమాన విద్యార్హతలు ఉన్న వీఆర్ఏలతో భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. రెవెన్యూ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జిల్లా కలెక్టర్లు ఫైలును పక్కన పెట్టారు. దీంతో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మరోసారి విజ్ఞప్తి చేయడంతో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతల్లో కొన్ని సడలింపులు చేస్తూ రెవెన్యూ శాఖ తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ప్రకారం తక్షణమే జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించి సీనియారిటీ ప్రాతిపదికన అర్హులైన వీఆర్ఏలను వీఆర్వోలుగా ఎంపిక చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
మార్గదర్శకాలు ఇవే…
> ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
> ఈ ఏడాది జనవరి 1,2020 నాటికి వీఆర్ఏలుగా ఐదేళ్ల సర్వీసు కంప్లీట్ అయి ఉండాలి.
> ఇంటర్మీడియట్ చదవకుండా నేరుగా డిగ్రీ, పీజీ చేసిన వారు కూడా అర్హులే.
> ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైనా కోర్సు కంప్లీట్ చేసి ఉంటే ఆ సర్టిఫికెట్లు సరైనవో కావో కలెక్టర్లకు ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి.
> అర్హులైన వీఆర్ఏలను వీఆర్వోలుగా ఎంపిక చేసేందుకు వన్టైమ్ ప్రాతిపదికన అనుమతించింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలను ఒకే పర్యాయానికి అనే షరతుతో మినహాయింపు ఇచ్చింది.
Read: యురేనియం కార్పొరేషన్లో 150 ట్రైనీ Jobs