Revenue Jobs : ఏపీ రెవెన్యూ శాఖలో 1,148 పోస్టులు
రెవెన్యూ శాఖలో వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులు ఎన్నో అధికారులు గుర్తించారు. మొత్తం 1,148 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తేల్చారు.
Revenue Jobs : రెవెన్యూ శాఖలో వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులు ఎన్నో అధికారులు గుర్తించారు. మొత్తం 1,148 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తేల్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను భూ పరిపాలన ప్రధాన కార్యాలయం సేకరించింది. రెవెన్యూ శాఖలో అన్ని కేటగిరిల్లో కలిపి మంజూరైన పోస్టులు 30,001 ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను మినహాయిస్తే… ప్రత్యక్ష నియామకాల కింద భర్తీ చేయాల్సినవి 9,918 పోస్టులు కాగా వీటిలో వెంటనే 1,148పోస్టులకు నియామకాలు అవసరమని గుర్తించారు. దీనిపై ఇంకా ప్రభుత్వ నిర్ణయం రాలేదు. ఈ అంశంపై ఏపీపీఎస్సీ, రెవెన్యూ విభాగాల ఉన్నతాధికారుల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులు
* డిప్యూటీ కలెక్టర్లు- 17 (గ్రూపు-1)
* డిప్యూటీ తహశీల్దార్లు – 67 (గ్రూపు-2)
* సీనియర్ స్టెనోగ్రాఫర్లు – 4, (గ్రూపు-2)
* జూనియర్ అసిస్టెంట్-కం-టైపిస్టు (సీసీఏల్ఏ కార్యాలయం) 65
* జూనియర్ అసిస్టెంట్స్ (జిల్లాల్లో)- 322
* జూనియర్ స్టెనోగ్రాఫర్(గ్రూపు-4) పోస్టులు మూడు చొప్పున ఖాళీగా ఉన్నాయి.
వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 670 (గ్రూపు-4) జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో రెవెన్యూ శాఖకు మంజూరు చేసిన 30,001 పోస్టుల్లో ప్రస్తుతం 9,918 ఖాళీగా ఉన్నాయి. వీటిలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (పార్టుటైం) పోస్టులు 7,917 ఉన్నాయి. వాస్తవానికి ఈ కేటగిరిలో 27,419 పోస్టులు మంజూరై ఉన్నాయి. మిగిలిన వాటిని ప్రత్యక్ష విధానంలో భర్తీ చేయాల్సి ఉన్నా అత్యవసరంగా పోస్టులు భర్తీ చేయాల్సిన జాబితాలో వీటికి స్థానం లభించ లేదు. అలాగే 861 టైపిస్టు పోస్టులు మంజూరు కాగా 635 పోస్టులను ప్రత్యక్ష విధానంలో భర్తీ చేయాల్సి ఉందని గుర్తించారు. ఈ పోస్టుల వివరాలూ భర్తీ చేయాల్సిన ఉద్యోగాల జాబితాలో లేవు.
వాస్తవానికి.. 670 జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయాలని చాలా కాలం క్రితమే రెవెన్యూ(సీసీఏల్ఏ) శాఖ నుంచి ఏపీపీఎస్సీకి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇప్పటికీ భర్తీ ప్రకటన వెలువడలేదు. పోస్టు హోదా.. అర్హతల విషయంలో స్పష్టత విషయమై ఏపీపీఎస్సీ, రెవెన్యూ శాఖల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా ప్రకటన జారీ కాలేదు. అలాగే భూ పరిపాలన ప్రధాన శాఖ కార్యాలయంలో 65 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండటంతో జిల్లాల నుంచి డిప్యుటేషన్లపై కొందరిని పిలుస్తున్నారు.