ఆన్ లైన్ లో బందరు చీరలు, ఊపిరిలూదిన ఆప్కో

  • Published By: madhu ,Published On : November 21, 2020 / 05:31 AM IST
ఆన్ లైన్ లో బందరు చీరలు, ఊపిరిలూదిన ఆప్కో

Bandaru Sarees In Online : కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన పలు రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇందులో చేనేత పరిశ్రమ కూడా ఒకటి. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పేరుపోయిన వస్త్ర నిల్వలను ఆప్కో కొనుగోలు చేయడం, తొలిసారిగా ఆన్ లైన్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంతో ఈ పరిశ్రమ నిలదొక్కుకొంటోంది. చేనేత రంగానికి పూర్వవైభం తీసుకరావాలన్న లక్ష్యంతో ఈ మార్కెటింగ్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమెజాన్, ఫ్లిప్ కార్డ్, గోకాప్ వంటి ఆన్ లైన్ కంపెనీలతో ఆప్కో ఒప్పందం కుదుర్చుకుంది. మేజర్ సొసైటీలన్నీ ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాయి. బందరు చీరల పేరిట ఉత్పత్తులను ఆన్ లైన్ లో పెడుతున్నాయి.



గతంలో కరోనా కారణంగా..వస్త్ర నిల్వలు భారీగా పేరుకపోయాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కోట్ల విలువైన వస్త్రాలు తయారయ్యాయి. కానీ..వీటిని ఏ విధంగా అమ్ముకోవాలో సొసైటీలు ఆందోళన చెందాయి. ఈ విలువైన వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసింది. దసరా, దీపావళి పండుగలతో సుమారు రూ. 6 కోట్లకు పైగా అమ్మకాలు జరగ్గా…రూ. 4 కోట్లకు పైగా విలువైన వస్త్రాలు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అయ్యాయి.



కృష్ణా జిల్లాలో 58 చేనేత సహకార పరపతి సంఘాలున్నాయి. వీటిలో 37 చేనేత సంఘాల పరిధిలో 7 వేల 047 మంది సుమారు 5 వేల మగ్గాలపై ఆధార పడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం వీరు రూ. 45 కోట్ల విలువైన వస్త్ర ఉత్పత్తులను తయారు చేస్తుంటారు. కృష్ణా జిల్లాలోని చేనేత కార్మికులు 9 గజాలు చీరల తయారీలో నిపుణులు. రూ. 700 నుంచి రూ. 2 వేల వరకు విలువైన కాటన్ చీరలకు పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది.



వస్త్ర ఉత్పత్తులు 60 శాతం ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇందులో 30 శాతం స్థానికంగా మార్కెట్ లో అమ్ముతుండగా..10 శాతం తూర్పుగోదావరి జిల్లా బండారు లంక మార్కెట్ కు తరలిస్తున్నారు. పెడన మార్కెట్ లో ఏటారూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.