Nara Lokesh To CRDA : అమరావతి రైతులకు వార్షిక కౌలు తక్షణమే విడుదల చేయాలి : సీఆర్డీఏకు నారా లోకేష్ లేఖ
అమరావతి రైతులకు వార్షిక కౌలు తక్షణమే విడుదల చేయాలని సిఆర్డిఏ/ఏఎంఆర్డీఏ కమిషనర్కు నారా లోకేష్ లేఖ రాశారు.
Annual lease of Amravati farmers : అమరావతి రైతులకు వార్షిక కౌలు తక్షణమే విడుదల చేయాలని సిఆర్డిఏ/ఏఎంఆర్డీఏ కమిషనర్కు నారా లోకేష్ లేఖ రాశారు. కౌలు విడుదలతో పాటు రైతుల ఆరోగ్య సంరక్షణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణకు రైతులు తమ భూమిని త్యాగం చేశారన్నారు.
రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూమి సాగు సామర్థ్యం ఆధారంగా వారికి రూ.30వేల నుంచి రూ.లక్ష వరకూ కౌలు చట్టపరంగా ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం పూర్వికుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను ఈ రైతులు త్యాగం చేశారనే విషయం ప్రభుత్వం మరవకూడదని పేర్కొన్నారు.
ప్రతి ఏటా మే నెలలో వీరికి కౌలు చెల్లించాల్సి ఉందని, కరోనా మొదటి దశలో గత ఏడాది కౌలు చెల్లింపు నెలరోజులకు పైగా ఆలస్యం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని లేఖలో ప్రస్తావించారు. కరోనా రెండో దశలో ఈ ఏడాది కూడా కౌలు ఇంత వరకూ కౌలు చెల్లించకపోవటం సరికాదన్నారు.
భూమిని త్యాగం చేసిన అధిక శాతం రైతుల్లో హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్న చిన్నకారు రైతులే ఉన్నారు. వారంతా ఈ వార్షిక కౌలు పైనే ఆధారపడి ఉన్నారని లోకేష్ గుర్తుచేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ తీవ్ర ప్రభావం చూపుతున్నందున రైతులకు వార్షిక కౌలు వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. దేశ ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువకు వెళ్లటానికి ముఖ్య కారణం సరైన ఆరోగ్య సంరక్షణ లేకపోవటమేనని అన్నారు.
అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం తాజా నివేదిక ప్రకారం.. కరోనా కారణంగా దేశంలో 23కోట్ల మంది భారతీయులు పేదలుగా మారారు. కరోనా సోకిన రైతు కుటుంబాలు ఆర్థికంగా కృంగిపోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 2014డిసెంబర్ నాటికి అమరావతి ప్రాంతంలో నివసించే వారందరికీ ఉచిత వైద్యసేవలు అందించేందుకు నాటి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుందన్నారు.