మరో ఎన్నికల నగరా : ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదల

మరో ఎన్నికల నగరా : ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదల

MLC Schedule Released : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గాను..కేంద్ర ఎన్నికల సంఘం..2021, ఫిబ్రవరి 11వ తేదీన షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 23 వరకు గడువు ఉంటుందని తెలిపింది. ఈ నెల 24వ తేదీన నామినేషన్ల పరిశీలన, 26వ తేదీన నామినేషన్ల విత్ డ్రా ఉండనుంది. మార్చి 14న పోలింగ్ (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు), మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని వెల్లడించింది.

ఇక ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే ఈ రాష్ట్రాల్లో రెండు ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు త్వరలోనే ఖాళీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ తో పాటు, నల్గొండ – ఖమ్మం – వరంగల్ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో తూర్పు గోదావరి – పశ్చిమ గోదావరి, కృష్ణా – గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి.

నల్గొండ – ఖమ్మం – వరంగల్ అభ్యర్థిగా రాములు నాయక్‌, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ స్థానానికి చిన్నారెడ్డిని కాంగ్రెస్ ఖరారు చేసింది. వరంగల్‌ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి, జనసమితి అభ్యర్థిగా కోదండరామ్, వామపక్షాల అభ్యర్థిగా జయసారథి రెడ్డి బరిలో ఉన్నారు. హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని టీఆర్ఎస్ వెల్లడించింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా రాంచంద్రారావు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్. కె.నాగేశ్వర్ ఉన్నారు.