బందరు పోర్టు నిర్మాణ పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
AP Cabinet green signal for Bandar port construction work : బందరు పోర్టు నిర్మాణ పనులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్స్ సంస్థ తయారు చేసిన డి.పి.ఆర్.కి ఆమోద ముద్ర వేసింది. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం ఉదయం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అందులో బందరు పోర్టు నిర్మాణ పనుల అంశం ఉంది. రూ.5,835 కోట్లతో మొదటి దశ పనులు చేపట్టాలని, మొత్తం 36 నెలల్లో మొదటి దశ పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాకింద 1000 కోట్లను కేటాయిస్తున్నట్లు, ఏ.పి.మెరిటైన్ బోర్డు ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుందన్నారు. నిధుల సమీకరణ బాధ్యత మెరిటైన్ బోర్డుదేనని స్పష్టం చేసింది కేబినెట్. తక్షణమే టెండర్లు పిలవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
కీలక బిల్లులతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రి మండలి సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 15 తర్వాత వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఏపీ సర్కార్. ఇక కేబినెన్లో అసెంబ్లీ సమావేశాలు, అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి.. ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలపై మంత్రిమండలి భేటీ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశముంది. దీంతో పాటు దిశ చట్టంలో మార్పులు చేసి మరోసారి ఆమోదించాల్సి ఉంది. అదే సమయంలో విశాఖకు రాజధాని మార్పుకు సంబంధించిన నిర్ణయాలు కూడా పెండింగ్లో ఉన్నాయి.