రాజధాని నిరసన గళం : రోడ్లపై వంటలు
రాజధాని ప్రాంతాల్లో ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం (మూడో రోజు) ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మహిళలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, రైతులు నిరసనలు చేపడుతున్నారు. తుళ్లూరు ప్రాంతంలో రోడ్లపై వంట వార్పు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్ల జెండాలు చేపట్టి..నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. సచివాలయం వెళ్లే మార్గాల్లో రాజధాని అమరావతిలో ఉండాలని, సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
తుళ్లూరుకు భారీగా రైతులు తరలివస్తున్నారు. మందడంలో అన్ని గ్రామాల ప్రజలతో మహాధర్నా నిర్వహిస్తామని ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. అమరావతిని రాజధానిగా ప్రకటించేదాక ఉద్యమించాలని రాజధాని ప్రాంత రైతులు డిసైడ్ అయ్యారు. వెలగపూడిలో చేపట్టిన రిలే నిరహార దీక్షలో ఉదయం నుంచే ప్రజలు పాల్గొంటున్నారు. 3 రాజధానులు వద్దు – అమరావతే ముద్దు అంటూ పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు. ఒక్క రాజధానికే దిక్కు లేదు..ఇంకా మూడు రాజధానులా అంటూ ప్రశ్నిస్తున్నారు. భూములు తిరిగి ఇచ్చేస్తామని అంటున్నారని..అంతా మీ ఇష్టమేనా అంటూ నిలదీశారు.
* 29 గ్రామాల్లో ఆందోళనలు ఉధృతం.
* పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
* రాజధాని ఆందోళనలకు జనసేన మద్దతు.
* రైతులను కలువనున్న జనసేన నాయకులు.
* ఎక్కడికక్కడ రోడ్ల దిగ్భందం.
* మందడంలో మహా ధర్నా.
గురువారం బంద్ పాటించిన రైతులు.. శుక్రవారం నుంచి నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటివరకు ఎవరికి వారుగా విడివిడిగా ఆందోళనలు చేసిన 29 గ్రామాల ప్రజలు… ఇక పై ఐక్య కార్యాచరణతో ముందుకు సాగనున్నారు. వెలగపూడిలో చేపట్టిన రిలే నిరాహర దీక్షలు కొనసాగిస్తూనే మందడంలో ఉదయం 9గంటలకు మహాధర్నాను చేపట్టనున్నారు.
Read More : వీరిని ఏం చేయాలి : గన్నవరంలో బాలికపై అత్యాచారం