Raghu Rama Krishna Raju : మీ వెనుకున్నది ఎవరు? అర్థరాత్రి వరకు రఘురామకృష్ణరాజును విచారించిన పోలీసులు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు మరోసారి విచారిస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో రఘురామను ఏ1గా పేర్కొన్న పోలీసులు, ఏ-2 ఏ-3గా రెండు చానల్స్ ను చేర్చారు. రాత్రంతా గుంటూరు సీఐడీ ఆఫీసులోనే రఘురామను అధికారులు ఉంచారు. అర్థరాత్రి వరకు ఆయనను విచారించారు. సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ స్వయంగా గుంటూరు ఆఫీసుకి వెళ్లారు.
Raghu Rama Krishna Raju : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు మరోసారి విచారిస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో రఘురామను ఏ1గా పేర్కొన్న పోలీసులు, ఏ-2 ఏ-3గా రెండు చానల్స్ ను చేర్చారు. రాత్రంతా గుంటూరు సీఐడీ ఆఫీసులోనే రఘురామను అధికారులు ఉంచారు. అర్థరాత్రి వరకు ఆయనను విచారించారు. సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ స్వయంగా గుంటూరు ఆఫీసుకి వెళ్లారు.
అధికార పార్టీ ఎంపీగా ఉంటూ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని అధికారులు ప్రశ్నించారు. ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరించమని, మీ వెనుకుండి నడిపిస్తున్నది ఎవరని ప్రశ్నించారు. కాగా, సీఐడీ అధికారుల తీరుపై రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తనను కావాలనే కేసులో ఇరికించిందని, తాను చేసిన తప్పేంటో చెప్పాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హై సెక్యూరిటీ వింగ్ లో ఉన్న తనను అక్రమంగా అరెస్ట్ చేసినట్లు రఘురామ వాదిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారనే అభియోగాలతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు నిన్న(మే 14,2021) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గుంటూరు తీసుకెళ్లారు. రాత్రి నుంచి ఆయన సీఐడీ కార్యాలయంలోనే ఉన్నారు. అర్ధరాత్రి వరకు అదనపు డీజీ సునీల్కుమార్ నేతృత్వంలో ఎంపీని విచారించారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యల సమాచారం, సాంకేతిక సహకారం ఎవరిస్తున్నారని ప్రశ్నలు వేశారు. ఈ విషయాల్లో ఎవరు సహకరిస్తున్నారని అడిగారు.
సీఐడీ కార్యాలయంలోనే ఎంపీకి శనివారం(మే 15,2021) ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. జీజీహెచ్ వైద్య బృందంతో పరీక్షలు చేయించారు. ఎంపీకి అవసరమైన మందులు, అల్పాహారాన్ని ఆయన వ్యక్తిగత సిబ్బంది సీఐడీ కార్యాలయంలో అందించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వాటిని ఎంపీకి అందజేశారు. కాగా, రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ మధ్యాహ్నం విచారణ జరగనుంది.
కొనసాగుతున్న సీఐడీ విచారణ..
గుంటూరులోని ప్రాంతీయ కార్యాలయంలో రఘురామకృష్ణరాజును సీఐడీ చేస్తున్న విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేలా మాట్లాడారంటూ రఘురామరాజుపై రాజద్రోహం(124a) కేసు పెట్టిన సీఐడీ.. ఏ1గా రఘురామకృష్ణరాజు, ఏ2, ఏ3గా ఛానళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విచారణ పూర్తి అయ్యే వరకు ఎంపీని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచవద్దని నిన్న రాత్రి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.