ఎన్డీయేలో చేరేందుకు జగన్ సిద్ధం, మోడీ ఆ రెండు డిమాండ్లకు ఒప్పుకుంటేనే..!

  • Published By: naveen ,Published On : October 19, 2020 / 11:10 AM IST
ఎన్డీయేలో చేరేందుకు జగన్ సిద్ధం, మోడీ ఆ రెండు డిమాండ్లకు ఒప్పుకుంటేనే..!

ap cm jagan: ఎన్డీయే నుంచి టీడీపీ బయటకొచ్చేసి చాలా రోజులైంది. ఇప్పుడదే ఏపీ నుంచి వైసీపీ.. ఎన్డీయేలోకి వెళ్లేందుకు.. ఢిల్లీ నుంచి రాయబారం మొదలైంది. కానీ.. ఒక అడ్డంకి, ఒక డిమాండ్.. రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆపుతున్నాయట. ఆ అడ్డంకి తొలగి.. ఆ డిమాండ్ గనక నెరవేరితే.. జగన్ పుల్ హ్యాపీ అంటున్నారు.

ఎన్డీయేలోకి వైసీపీ?
వైసీపీ ఎన్డీయేలో చేరుతుందన్న ప్రచారం అప్పట్లో.. ఢిల్లీ నుంచి ఏపీ గల్లీ దాకా హోరెత్తిపోయింది. కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ.. అదే మాట వినిపిస్తోంది. వైసీపీని ఎన్డీయేలో చేర్చుకునేందుకు ఢిల్లీ నుంచి రాయబారం కూడా మొదలైపోయిందని టాక్.

వైసీపీ ఎన్డీయేలో చేరటానికి ఉన్న ప్రధాన అడ్డంకి:
వైసీపీ ఎన్డీయేలో చేరటానికి ఉన్న అడ్డంకి ఏమిటంటే.. ప్రత్యేక హోదా. 25 ఎంపీ సీట్లు ఇస్తే.. కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకొస్తామని వైసీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఫలితాల్లో.. 22 సీట్లను కైవసం చేసుకుంది. వాళ్లనుకున్న టార్గెట్ కు.. కొద్దిదూరంలో ఆగిపోయిందంతే. ఆ తర్వాత.. బీజేపీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని.. క్లియర్ గా తేల్చి చెప్పేసింది. ఐతే.. హోదాకు ప్రత్యామ్నాయంగా.. స్పెషల్ కేటగిరీ స్టేటస్ పేరు మాత్రం మార్చి.. హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ ఇస్తామనేది బీజేపీ మాట. ఐతే.. దీనినే రాతపూర్వక హామీగా ఇవ్వాలని వైసీపీ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ అడ్డంకిని అధిగమిస్తే గానీ.. వైసీపీ ఎన్డీయేలో చేరే పరిస్థితి లేదు.

సీబీఐ ఎంక్వైరీ వేస్తే జగన్ రెడీ:
వైసీపీ.. ఎన్డీయేలో చేరాలంటే మరో డిమాండ్ నెరవేరాల్సిన పరిస్థితి నెలకొంది. అది జరిగితేనే.. జగన్ పార్టీ ఎన్డీయేలోకి వెళ్లేందుకు రెడీగా ఉందని సమాచారం. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ స్కామ్ పై సీబీఐ విచారణ జరిపించాలనేదే.. వైసీపీ డిమాండ్. ఇప్పటికే.. వీటికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ మంత్రికి కొన్ని డాక్యుమెంట్స్ కూడా పంపించేశారు. సమాచారమంతా ఇచ్చేశారు. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ స్కామ్ లపై గనక.. కేంద్రం సీబీఐ ఎంక్వైరీ వేస్తే జగన్ కోరిక నెరవేరుతుంది.

ప్రత్యేక హోదా అడ్డంకి తొలగి.. సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ నెరవేరితే.. వైసీపీ ఎన్డీయేలోకి వెళ్తుందని టాక్. ఐతే..ఏదైనా బిహార్ ఎన్నికల తర్వాతే క్లారిటీ వస్తుందని ఢిల్లీ వీధుల్లో వినిపిస్తున్న మాట.