వైఎస్ఆర్కు, కుటుంబసభ్యుల ఘన నివాళి
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి రెడ్డి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాలో.. నాతో వైఎస్సార్…పుస్తకం ఆవిష్కరణ
వైఎస్సార్కు నివాళి అనంతరం “నాలో.. నాతో వైఎస్సార్” పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని వైఎస్ విజయమ్మ రచించారు. వైఎస్సార్ స్వర్గస్థులైన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం “నాలో.. నాతో వైఎస్సార్”. వైఎస్సార్ సహధర్మచారిణిగా వైఎస్ విజయమ్మ జీవితసారమే ఈ పుస్తకం. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… నాన్న జయంతిని పురస్కరించుకుని అమ్మ ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం అమ్మ.. నాన్నను చూసిన విధంగా.. ”నాలో.. నాతో.. వైయస్ఆర్” రచన చేశారని సీఎం అన్నారు.
నాన్న బయట ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా, ఒక గొప్ప నాయకుడిగా మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి అని తెలిపారు. వైయస్ఆర్ గారిలో ఉన్న గొప్పతనాన్ని, ఒక భర్తను, తండ్రిని, మంచి వ్యక్తిని అమ్మ పుస్తక రూపంలో ఆవిష్కరించారని సీఎం వైయస్ జగన్ కొనియాడారు. నాన్నతో అమ్మ చేసిన సుదీర్ఘ ప్రయాణంలో తాను తెలుసుకున్న, చూసిన నాన్నను ఈ పుస్తకంలో ఆవిష్కరించారని సీఎం జగన్ అన్నారు.
Read Here>>కరోనా ఎఫెక్ట్, ఏపీలో 13 ప్రత్యేక జైళ్లు, ప్రభుత్వం కీలక నిర్ణయం