CM YS Jagan : ఈ నెల 18వ తేదీ లోపు అందరికీ డబ్బులు
పొదుపు సంఘాలకు ఇచ్చిన రుణాల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో..
CM YS Jagan : పొదుపు సంఘాలకు ఇచ్చిన రుణాల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభించారు జగన్. డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేశ్, బాలినేని, విశ్వరూప్, పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ముందు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నామని, నేరుగా లబ్ధిదారులకు డబ్బులు వేస్తున్నామని జగన్ అన్నారు.
అప్పట్లో తాను పాదయాత్రలో చేసిన వ్యాఖ్యల వీడియోను ఈ సందర్భంగా ఆయన చూపించారు. చంద్రబాబు ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాల మాఫీ చేయలేదని అందులో జగన్ అన్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మిన మహిళలు ఆయన్ను సీఎంను చేశారని.. కానీ చంద్రబాబు మాత్రం మహిళలను మోసం చేశారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించని కారణంగా బ్యాంకుల్లో వడ్డీలు పెరిగి రూ.14వేల కోట్లుగా ఉన్న రుణాలు 2019 ఎన్నికల నాటికి రూ.25,517 కోట్లకు పెరిందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 18.3శాతం పొదుపు సంఘాలు మూతబడగా.. మిగిలిన సంఘాల పరపతి దెబ్బతిందన్నని జగన్ వాపోయారు.
Height : ఎలాంటి ఆహారం తింటే ఎత్తు పెరుగుతారో తెలుసా?..
మాజీ సీఎం చేసిన వంచన వల్ల మహిళలు రూ.3వేల కోట్లకు పైగా బ్యాంకులకు అదనంగా చెల్లించాల్సి వచ్చిందని ఆరోపించారు. అలాగే గత ప్రభుత్వం సున్నావడ్డీ రుణ పథకాన్ని కూడా రద్దు చేసిందన్నారు. కాగా, తమ ప్రభుత్వంలో మాత్రం గతేడాది కూడా మహిళలకు నేరుగా డబ్బులు అందించామని జగన్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సీ గ్రేడ్ కి చేరిన సంఘాలు ఇప్పుడు ఏ గ్రేడ్ కు చేరుకున్నాయని జగన్ చెప్పారు.
ఈ నెల 18 వరకు డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాలో నగదు జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. దేవీ నవరాత్రుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభపరిణామం అన్నారు. కాగా, ఈ నెల 13, 14న పండగ కారణంగా అర్హుల ఖాతాలో నగదు జమ అవ్వదన్నారు. అలాగే కడప జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ జిల్లాకు చెందిన వారికీ నగదు ఖాతాలో జమ అవ్వదని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నవంబర్ 6 నుంచి 15వ తేదీ వరకు నగదు జమ చేస్తామని జగన్ తెలిపారు.
Brinjal : వంకాయ క్యాన్సర్ ని అడ్డుకుంటుందా?
‘‘మహిళలకు సుస్థిర ఆదాయం కల్పించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గతంలో 18.36 శాతం నిరర్ధక సంఘాలు ఉండేవి. ఆసరా కార్యక్రమంతో అవి 0.7 శాతానికి తగ్గాయి. సీ, డీ గ్రేడ్ సంఘాలు ఇప్పుడు ఏ, బీ గ్రేడ్గా ఎదిగాయి. రుణాల రికవరీ శాతం గణనీయంగా పెరిగింది. ఐటీసీ, అమూల్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని కార్యక్రమాలు చేపడుతున్నాం. 21వ శతాబ్దపు ఆధునిక మహిళ ఆంద్రప్రదేశ్లోనే ఉద్భవించాలని కోరుకుంటున్నా. ఒప్పందాలతో మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేస్తున్నాం.
రాష్ట్రంలో 61 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. 7.97 లక్షల సంఘాల్లోని 78.76 లక్షల మంది మహిళల పొదుపు ఖాతాల్లో రూ.6,439 కోట్లను జమ చేయనున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు.
”పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 2019 ఏప్రిల్ నాటికి మహిళా సంఘాలకు ఉన్న అప్పులన్నీ తిరిగి కడుతున్నామన్నాం. ఆ మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేలా వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టాం. మొదటి విడతలో 6వేల 318 కోట్లు, రెండో విడతలో 6వేల 440 కోట్లు రెండేళ్లలో 12వేల 758 కోట్లు మహిళలకు ఇస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం కింద సకాలంలో రుణాలు తిరిగి తెల్లించిన 9లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.2వేల 362కోట్లు ఇచ్చామని” జగన్ అన్నారు.
ఆసరా స్కీమ్ కింద డ్వాక్రా గ్రూపు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను నేరుగా జమ చేస్తోంది. నేటి నుంచి రెండో విడతలో 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళల ఖాతాల్లో డబ్బు పడనుంది. ఆయా సంఘాల్లో మొత్తం 78.76 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మొత్తం రూ.6వేల 439.52 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. గతేడాది తొలి విడతలో ప్రభుత్వం రూ.6వేల 318.76 కోట్లు మహిళలకు అందజేసింది.