వైయస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం జగన్ 

వైయస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం జగన్ 

‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం  ఆయన జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల దీవెనలు, దేవుడి దయ వల్ల ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగామని చెప్పారు. గడిచిన 13 నెలలో కాలంలో 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేయడం జరిగిందని సీఎం చెప్పారు.

ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు 
> ఎక్కడా వివక్షకు తావునివ్వలేదు. మనకు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డాం.
> ఇవాళ కాపు అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది ఎంత ఖర్చు చేశామని చూస్తే.. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు అక్షరాలా రూ.4770 కోట్లు ఇవ్వడం జరిగింది.
> అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేశాము. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదు.
> బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లింపు.
> పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాలో వేస్తున్నాం.
> ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం.
> అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. మీ పేరు లేకపోతే, మీకు అర్హత ఉంటే, వెంటనే దరఖాస్తు చేసుకోండి.
> వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం.
> గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి.
> గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది? చూడండి.ఏటా రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా సగటున రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చింది.
> కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చింది.
> దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో మీకు ఇంకా మంచి చేయాలని భావిస్తున్నాను అని సీఎం జగన్ అన్నారు.

Read: ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15వేలు, సీఎం జగన్ మరో గుడ్ న్యూస్