AP Finance Minister : కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన తర్వాత అనేక రాష్ట్రాలు కేంద్రం బాటలో పయనించి తమ రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లను తగ్గించాయి. పెట్రోల్ రేట్లు తగ్గించిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ కర్ణాటకతోపాటూ మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. రాష్ట్రప్రభుత్వం ధరలు తగ్గిస్తే ప్రజలపై భారం మరింత తగ్గుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు ధరలు తగ్గించేలా కనిపించడం లేదు
చదవండి : Minister Buggana : ఏపీ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన కీలక ప్రకటన
పెట్రోల్ ధరలపై ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు
ఇంధన ధరల తగ్గింపుపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అనంతమాత్రంగానే ఉందని.. ఈ సమయంలో ధరలు తగ్గిస్తే రాష్ట్ర ఖజానాపై మరింత భారం పడే అవకాశం ఉందని వివరించారు. కేంద్రానికి ఉన్నన్ని ఆర్థిక వనరులు రాష్ట్రాలకు ఉండవని, కేంద్రం నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలో రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవడం కుదరదని.. కొన్ని రాష్ట్రాలు తీసుకున్నా అవి వారి ఆర్ధిక పరిస్థితి బట్టి ఈ నిర్ణయం తీసుకోని వుంటాయని తెలిపారు. రాష్ట్రానికి పెట్రోల్ ,ఎక్సైజ్ ద్వారా మాత్రమే ఆదాయం వస్తుందని బుగ్గన వెల్లడించారు. ఇప్పటికే పెంచిన పన్నులను కొంత తగ్గించమని తెలిపారు.