గుడ్ న్యూస్, పెద్ద మొత్తంలో కరోనా మందు సిద్ధం చేస్తున్న జగన్ ప్రభుత్వం, జిల్లాలకు చేరనున్న 15వేల డోసుల రెమ్‌డెసివర్

  • Published By: naveen ,Published On : July 25, 2020 / 12:34 PM IST
గుడ్ న్యూస్, పెద్ద మొత్తంలో కరోనా మందు సిద్ధం చేస్తున్న జగన్ ప్రభుత్వం, జిల్లాలకు చేరనున్న 15వేల డోసుల రెమ్‌డెసివర్

కోవిడ్‌ మరణాల రేటు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. వైరస్‌ కారణంగా విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి ఉపయోగించే రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్‌ లాంటి యాంటీవైరల్‌ డ్రగ్ లను పెద్ద మొత్తంలో ఆస్పత్రులకు అందుబాటులో ఉంచుతోంది. రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ రెమ్‌డెసివర్‌ డ్రగ్స్‌ను ప్రభుత్వానికి అందిస్తోంది. కంపెనీ నుంచి రేపు(జూలై 26,2020) సాయంత్రానికి 15వేలకుపైగా డోసులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని ఆస్పత్రులకు చేరుకుంటున్నాయి. ఇంతకు ముందు మరో 5వేల డోసులను చేర్చారు. ఆగస్టు మూడోవారం నాటికి దాదాపు 70వేలకుపైగా డోసులు అందుబాటులోకి వస్తున్నాయి. అంటే దాదాపు 90వేలకుపైగా రెమ్‌డెసివర్‌ డోసులను ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఇక భయపడాల్సిన పని లేదు:
విషమ పరిస్థితుల్లో ఉన్న 15వేల మందికి ఈ మందులు సరిపోతాయని వైద్య ఆరోగ్యశాఖ చెప్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రానికీ ఇంజక్షన్లు లేవని అధికారులు చెప్పారు. గణాంకాల ప్రకారం క్రిటికల్‌ కేర్‌ చికిత్స అవసరమైన రోగుల సంఖ్య పాజిటివ్‌ కేసుల్లో 7 నుంచి 8 శాతం వరకూ ఉంటోంది. అంటే దాదాపు 2లక్షల పాజిటివ్‌ కేసుల వరకూ ప్రభుత్వం తెప్పించుకుంటున్న ఇంజెక్షన్లు సరిపోతాయి. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, భయం వద్దని సీఎం ఇవ్వాళ్టి(జూలై 25,2020) సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు.

ఒకొక్కరిపై దాదాపు రూ.35వేల ఖర్చు:
పరిస్థితిని బట్టి ఒక్కో రోగికి 5 నుంచి 7 డోసులు వరకూ రెమ్‌డెసివర్‌ను వినియోగించాల్సి వస్తుంది. ఇలా ఒకొక్కరిపైనా దాదాపు రూ.35వేల రూపాయల వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఖర్చు ఎంతైనా సరే… ఈ అత్యవసర డ్రగ్స్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం ఇదివరకే ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్‌ రెమ్‌డెసివర్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడి అవసరాలకు అనుగుణంగా ఈ మందును అందించాలని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది.

* కోవిడ్‌ మరణాలు తగ్గించడంపై దృష్టి
* కోవిడ్‌ ఆస్పత్రుల్లో అందుబాటులోకి అత్యవసర మందులు
* ఇప్పటికే హెటిరో నుంచి రెమ్‌డెసివర్‌ కొనుగోలు
* రాష్ట్రంలోనే తయారు, పెద్ద సంఖ్యలో ఆర్డర్‌
* రేపు సాయంత్రానికి జిల్లాల్లోని ఆస్పత్రులకు చేరుకుంటున్న డోసులు 15వేలు
* ఇదివరకే 5వేల డోసులు చేరిక
* ఆగస్టు మూడో వారం నాటికి దాదాపు 90వేలకు పైగా డోసులు