కొత్త భవనాలు, సకల సదుపాయాలు.. అంగన్ వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చేయనున్న ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ కేంద్రాల రూపు రేఖలు మార్చేయనుంది. మెరుగైన విద్యను అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని అంగన్వాడీ కేంద్రాలకూ వర్తింప చేయనుంది. ఇందులో భాగంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న
anganwadi centers: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ కేంద్రాల రూపు రేఖలు మార్చేయనుంది. మెరుగైన విద్యను అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని అంగన్వాడీ కేంద్రాలకూ వర్తింప చేయనుంది. ఇందులో భాగంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న 23వేల 510 కేంద్రాలకు కొత్త భవనాలను నిర్మించనుంది. మరో 16వేల 681 కేంద్రాల్లో మరమ్మతులు, అదనపు సదుపాయాలతో నవీకరించనుంది. మూడు దశల్లో వీటి నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. ఏప్రిల్ 1 నుంచి నిర్మాణ పనులు ప్రారంభించనుంది.
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్యను అమల్లోకి తీసుకురానున్న నేపథ్యంలో వాటి పేరును వైఎస్సార్ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్పు చేసింది. నవీకరణలో భాగంగా ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి రూ.6.9 లక్షలు కేటాయించనుంది. ఇందులో భాగంగా ప్రతి కేంద్రానికి 9 రకాల వసతులు కల్పిస్తారు. ఫ్రిజ్, వాటర్ ఫిల్టర్, ట్యూబ్లైట్, ఫ్యాన్లు, ఫర్నిచర్, గ్రీన్ చాక్బోర్డు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్డి, ఆట వస్తువులు, పెయింటింగ్, వంట గది నిర్మాణం, ఇతర మరమ్మతులు చేపట్టనుంది.
ఇవి కాకుండా ఉపాధి హామీ చట్టం నిధులతో ప్రహరీని నిర్మిస్తారు. కొత్త అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి రూ.14 లక్షలు కేటాయించనుంది. వంటగది, సామగ్రి నిల్వ గది, మరుగుదొడ్డి, ఆటస్థలంతో కలిపి 814 చ.అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాలు నిర్మించనుంది. ఈ వసతులన్నీ కొత్తగా నిర్మించే కేంద్రాల్లోనూ ఏర్పాటు చేస్తారు. నవీకరణ, కొత్త భవనాల నిర్మాణ పనులను అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ కమిటీకి సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ కన్వీనర్గా వ్యవహరిస్తారు.
స్థానిక అంగన్వాడీ కార్యకర్త, సూపర్వైజర్, మహిళా సంరక్షణ కార్యదర్శి, కేంద్రంలో 2-4 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లల తల్లులు సభ్యులుగా ఉంటారు. నిర్మాణ పనులను రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ పర్యవేక్షిస్తుంది. నిధులు కూడా ఈ సంస్థ నుంచి నేరుగా అంగన్వాడీ అభివృద్ధి కమిటీ బ్యాంకు ఖాతాలోకే జమ అవుతాయి. నిర్మాణం, కమిటీల ఏర్పాటుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను ఏప్రిల్ 6-9 తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇవి కాకుండా ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఉండే 11 వేల కేంద్రాల నవీకరణ పనులను విద్యాశాఖ చేపట్టనుంది.