ఏపీలో 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, తొలి దశలో 15లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక

  • Published By: naveen ,Published On : August 9, 2020 / 11:22 AM IST
ఏపీలో 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, తొలి దశలో 15లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక

కరోనా సంక్షోభం సమయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన జగన్, ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదల కోసం ప్రభుత్వం తొలి దశలో 15 లక్షల ఇళ్లను నిర్మించనుంది. ఇందుకోసం ప్రణాళికి సిద్ధం చేసింది. రాష్ట్రంలో అర్హులైన 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనుండటంతో వారికి ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఇప్పటికే 26 వేల ఎకరాలకు పైగా భూముల్లో లేఔట్లు వేసి పట్టాల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ప్రత్యేక డిజైన్‌..
* తొలి విడతలో 15 లక్షల ఇళ్లు నిర్మించేందుకు వీలుగా గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.
* ఇందులో భాగంగా ప్రీ-కాస్ట్‌ ఆర్‌సీసీ శ్లాబ్‌తో లబ్ధిదారులకు సరసమైన ఖర్చుతో ఇళ్లు నిర్మించేందుకు డిజైన్‌ను తయారు చేశారు.
* నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన సెంట్రింగ్‌ మెటీరియల్‌ సరఫరా చేసేందుకు గృహనిర్మాణ శాఖ టెండర్లు పిలిచింది.
* ప్రీ-కాస్ట్‌ ఆర్‌సీసీ శ్లాబ్‌తో నిర్మాణాల కోసం అనుభవం ఉన్న కంపెనీల నుంచి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు.
* భారీ నిర్మాణాల్లో అనుభవం ఉన్న కంపెనీలకే అవకాశం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
* ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
* నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు టెక్నికల్‌ కమిటీని ఏర్పాటు చేస్తారు.
* లబ్ధిదారులు సొంతంగా లేదా అధికారుల పర్యవేక్షణలో నిర్మించుకునేందుకు కూడా అవకాశం కల్పించనున్నారు.
* టీడీపీ హయాంలో 2014 నుంచి 2016 వరకు ఒక్క ఇంటికి కూడా శంకుస్థాపన చేయలేకపోయారు.
* ఆ తర్వాత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్లతోపాటు వివిధ పథకాల కింద 6.20 లక్షల ఇళ్లు మంజూరు చేశారు.
* ఇందులో 3.50 లక్షల వరకు మాత్రమే పూర్తి చేసినా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా నిధులన్నీ సార్వత్రిక ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించారు.
* టీడీపీ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను ఏం చేద్దామనే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో దాదాపు 20 శాతం కుటుంబాలకు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సంబంధించిన కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. మొదటి విడతలో 15 లక్షల ఇళ్లు నిర్మించేందుకు వీలుగా గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప్రీ-కాస్ట్‌ ఆర్‌సీసీ శ్లాబ్‌తో లబ్ధిదారులకు సరసమైన ఖర్చుతో ఇళ్లు నిర్మించేందుకు డిజైన్‌ను తయారు చేశారు. నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన సెంట్రింగ్‌ మెటీరియల్‌ సరఫరా చేసేందుకు గృహనిర్మాణ శాఖ టెండర్లు పిలిచింది. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

పేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేయబోతున్నారని మంత్రులు చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఇంటి స్థలం ఇస్తున్నామన్నారు. హోసింగ్ స్కీం కోసం మొత్తం 42వేల 920 భూములు అవసరం అవుతున్నాయని, 25వేల 842 ఎకరాలు ప్రభుత్వ, 16వేల 078 ఎకరాలు ప్రైవేటు భూములు వినియోగించనున్నారు. భూసేకరణ కోసం 6వేల 500 కోట్లు ఖర్చు చేశారు. 16 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు లే ఔట్స్ వేశారు. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి 15 లక్షల మాత్రమే ఇళ్లు ఇవ్వగలిగారని, జగన్ సీఎం అయ్యి ఒక్క ఏడాదిలోనే 30 లక్షల స్థలాలు ఇవ్వబోతున్నామని మంత్రులు చెప్పారు.

2023 నాటికి రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చెయ్యాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నట్టు మంత్రులు తెలిపారు. తాము ఈ పథకం కోసం ఓ యజ్ఞంలా పని చేస్తుంటే టీడీపీ దృష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాజమండ్రి ఎయిర్ పోర్టు సమీపంలో మార్కెట్ ధర రూ. 22 లక్షలు ఉందని, భూసేకరణ చట్టం ప్రకారం 43 లక్షలకు తీసుకున్నట్టు చెప్పారు. అక్కడేదో కుంభకోణం జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక లబ్ధిదారులను పిలిచి మరీ ఇంటి స్థలం ఇస్తుంటే డబ్బులు తీసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.