ఏలూరు కార్పొరేషన్ ఎలక్షన్స్ వాయిదా..ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు
పోలింగ్ తేదికి రెండు రోజులు ముందు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఓటర్ల జాబితాను సవరించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో రేపు జరగాల్సిన కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
Eluru Corporation Elections postponed : పోలింగ్ తేదికి రెండు రోజులు ముందు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఓటర్ల జాబితాను సవరించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో రేపు జరగాల్సిన కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫికేషన్ వెలువడింది మొదలు ఎన్నికల ప్రచారంలో ఊపిరిసలపకుండా పని చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు కోర్టు తీర్పుతో నిరాశకు లోనయ్యారు.
ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ తెలుగుదేశం పార్టికి చెందిన కొందరు హైకోర్టును గతంలో ఆశ్రయించారు. ఫారం- 7ను ఉపయోగించుకుని తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగించారంటూ పిటిషన్లో కోరారు. దీంతో ఓటర్ల జాబితాలో అవకతవకలు సవరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు అమల్లోకి రాకముందే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీనిపై మరోసారి కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం ఎన్నికలను వాయిదా వేసింది.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉండగా 2,47,631 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే 3 డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగిలిన 47 డివిజన్లలో మెజార్టీ స్థానాల్లో గెలుపొంది కార్పొరేషన్ దక్కించుకునేలా మంత్రి ఆళ్లనాని వ్యూహాలు రూపొందించారు. మరోవైపు కోర్టులో కేసు ఉన్నప్పటికీ బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. అన్ని పార్టీల అభ్యర్థులు లక్షల రూపాయలు ప్రచారానికి వెచ్చించారు. కోర్టు తీర్పుతో వీరంతా నిరాశలో కూరుకుపోయారు.