మరికాసేపట్లో ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్…ఓటు వేసేందుకు వచ్చే వారికి మాస్క్ తప్పనిసరి
నువ్వా నేనా.. అన్నట్టు సాగిన మున్సిపల్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మరికాసేపట్లో జరగనున్న పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఏడుగంటల నుంచి పోలింగ్ ప్రారంభమవనుండగా.. సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది.
AP Municipal Election : నువ్వా నేనా.. అన్నట్టు సాగిన మున్సిపల్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మరికాసేపట్లో జరగనున్న పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఏడుగంటల నుంచి పోలింగ్ ప్రారంభమవనుండగా.. సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. మొత్తం 7 వేల 915 పోలింగ్ కేంద్రాల్లో సగానికిపైగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నందున భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వేల320 అత్యంత సమస్యాత్మక, 2 వేల 468 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ప్రకటించారు. వీటిలో విజయవాడలోనే అత్యధికంగా 221, విశాఖపట్నంలో 185, గుంటూరులో 139, కడపలో 137, తిరుపతిలో 130, కర్నూలులో 123 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఓటు వేయడానికి వచ్చే ప్రతీ ఒక్కరికి మాస్క్ తప్పనిసరి. బ్యాలెట్ పద్ధతిలోనే ఈ ఎన్నిక జరుగుతుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది.12 కార్పొరేషన్లలో 671 డివిజన్లు ఉండగా.. 89 ఏకగ్రీవం అయ్యాయి. 582 డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయి. 71 మున్సిపాల్టీల్లో 2 వేల 123 వార్డులు ఉంటే.. 490 ఏకగ్రీవం అయ్యాయి. 16 వందల 33 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయ్. అటు 2 వేల 215 డివిజన్లు, వార్డులకు కలిపి.. 7వేల 552 మంది బరిలో ఉన్నారు. మున్సిపోల్స్లో 78 లక్షల 71 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మరోవైపు ఏలూరు, చిలకలూరిపేట కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలింగ్ నిర్వహించొచ్చని తేల్చేసింది. ఫలితాలను మాత్రం ప్రకటించొద్దని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవండపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. దాంతో ఎన్నికలు ఆపేయాలని తెలిపంది. ఆ తీర్పుపై లంచ్ మోషన్ పిటీషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. జోనల్ అధికారులు, పర్యవేక్షణ టీంలకు మెజిస్టీరియల్ అధికారాలు ఇచ్చామన్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్. కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు ఎన్నికలను పర్యవేక్షిస్తారని తెలిపారాయన. పంచాయితీ ఎన్నికలకు సహకరించినట్లు, మునిసిపల్ ఎన్నికలకు కూడా సహకరించాలని ప్రజలకు రమేష్ విజ్ఞప్తి చేశారు. అంతా స్వచ్ఛందంగా వచ్చి స్వేచ్ఛగా ఓటు వేయాలని పిలుపునిచ్చారాయన.
మెజార్టీ స్థానాలు కైవశం చేసుకోవాలని అధికార ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో కసరత్తు చేశాయ్. మంత్రులు ఇంటింటి ప్రచారం చేస్తే… టీడీపీ ఇతర పార్టీలు కూడా అదే స్థాయి ప్రచారంతో పోటీని తీవ్రం చేశారు. విజయంపై ఎవరి ధీమా వాళ్లకే ఉన్నా.. ఓటర్లు ఎటు మొగ్గుతారో అన్న టెన్షన్ కూడా అన్ని పార్టీల్లో కనిపిస్తుంది. మిగిలిని మున్సిపాలిటీలు ఒకెత్తు.. విజయవాడ, గుంటూరు, విశాఖ ఒకెత్తు అన్నట్టు టీడీపీ, వైసీపీ ప్రచారం చేశాయ్. విశాఖపై ఉక్కుసెగ, కార్యనిర్వహక రాజధాని ప్రభావం ఉండగా.. విజయవాడ, గుంటూరుపై అమరావతి ఎఫెక్ట్ పడే అవకాశముంది. దీంతో విజయం ఎవరి పక్షం ఉంటుందన్న చర్చ సాగుతోంది.