Telugu States : విద్యుత్ వివాదం, విద్యుత్ ప్రాజెక్టుల వద్ద ఏపీ అధికారులు
కృష్ణా జలాల వివాదం కాస్తా.. ఇప్పుడు విద్యుత్ వివాదంగా మారింది. ప్రాజెక్టుల దగ్గర తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండి పడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తక్షణం పవర్ జనరేషన్ను నిలిపివేయాలంటూ తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టుల దగ్గరకు ఏపీ అధికారులను పంపించింది.
Power Disputes : కృష్ణా జలాల వివాదం కాస్తా.. ఇప్పుడు విద్యుత్ వివాదంగా మారింది. ప్రాజెక్టుల దగ్గర తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండి పడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తక్షణం పవర్ జనరేషన్ను నిలిపివేయాలంటూ తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టుల దగ్గరకు ఏపీ అధికారులను పంపించింది. నాగార్జునసాగర్తో పాటు పులిచింతల ప్రాజెక్టు దగ్గరకు వీరు వెళ్లారు.
వెంటనే విద్యుత్ ఉత్పత్తి ఆపాలని అధికారులను కోరారు. ఇక్కడ పులిచింతలలో ఏపీ అధికారుల నుంచి వినతిపత్రాన్ని తీసుకున్న తెలంగాణ అధికారులు నాగార్జున సాగర్ లో మాత్రం విజ్ఞప్తి లేఖను తీసుకోవడానికి నిరాకరించారు. పులిచింతల ప్రాజెక్టు ఎస్ఈ రమేష్బాబు, ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారి శ్యాంప్రసాద్.. టీఎస్ జెన్కో ఎస్ఈ దేశ్యానాయక్కు లేఖను సమర్పించారు. పులిచింతలలో మినిమం డ్రా డౌన్ లెవల్ కంటే ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉందంటూ అభ్యంతరం తెలిపారు ఏపీ ఇరిగేషన్ అధికారులు.
మరోవైపు కృష్ణా జలాలపై అనవసర వివాదానికి చెక్ పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని అనుకుంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసి అనుమతులు తెచ్చుకున్న తర్వాతే నీళ్లు తీసుకెళ్లాలన్నారు. ఈ వ్యవహారంలో ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమని చెప్పారాయన.
తెలంగాణలోని ఏపీ ప్రజల ఆస్తులు, పరిశ్రమలు, ఉద్యోగాలకు ఏమైనా ఇబ్బంది కలిగించామా అని ప్రశ్నించారాయన. ఇదిలా ఉంటే..విజయవాడ ఎంపీ కేశినేని స్పందించారు. జల వివాదం అనేది ఒక పెద్ద డ్రామాగా అభివర్ణించారు. సీఎంలు కేసీఆర్, జగన్ మధ్య ఉన్న అవగాహన ఒప్పందం అందరికీ తెలుసని వెల్లడించారు. కేవలం ఆస్తులు కాపాడుకునేందుకు మాత్రమే కేసీఆర్, జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఇద్దరు కలిసే పనిచేశారని.. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు కేశినేని నాని.