పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధత : నేటి నుంచి నామినేషన్లు, సుప్రీం తీర్పుపై ఉత్కంఠ

పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధత : నేటి నుంచి నామినేషన్లు, సుప్రీం తీర్పుపై ఉత్కంఠ

AP panchayat election Nomination : ఏపీలో పంచాయతీ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికలకు వెళ్తామని ఎస్‌ఈసీ తేల్చిచెబుతుంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం ఖరాఖండిగా చెబుతోంది. అసలు సర్కార్‌ – ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మధ్య ఎక్కడ చెడింది.. ఈ వివాదం ఎప్పటిది..? మరి సస్పెన్స్‌కు పుల్‌స్టాప్‌ ఎక్కడ..?  ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సందిగ్ధంలో ఉంది. నోటిఫికేషన్‌ విడుదల చేసి, ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ముందుకు వెళ్తుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ససేమిరా అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. 2021, జనవరి 25వ తేదీ సోమవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సిఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఈ అనిశ్చితి కొనసాగనుంది.

మార్చిలో వివాదం : –
ఏపీలో ఎస్‌ఈసీ వర్సెస్‌ సర్కార్‌ వార్‌ నడుస్తోంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. ప్రభుత్వం మధ్య గతేడాది మార్చిలోనే వివాదం మొదలైంది. మార్చి 21న జరగాల్సిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు.. మార్చి 27న తొలి విడత పంచాయతీ ఎన్నికలు, మార్చి 29న తుది విడల ఎన్నికలను వాయిదా వేశారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌. కరోనా వల్ల ఎన్నికలు నిర్వహించలేమంటూ.. ఆరు వారాల పాటు పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఏప్రిల్ లో: –
అయితే లోకల్‌ ఎలక్షన్స్‌ జరగాల్సిందేనంటూ ప్రభుత్వం పట్టుబట్టింది. దీనిపై జగన్‌ స్వయంగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కూడా కలిశారు. కోర్టులను కూడా ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఇదే క్రమంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సీఎస్‌గా కనగరాజన్‌ను నియమించింది. దీనిపై రమేశ్‌కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదంతా గతేడాది ఏప్రిల్‌లో చోటుచేసుకుంది.

అక్టోబర్ లో మరోసారి వివాదం, నవంబర్ లో కీలక నిర్ణయం : –
ఇక అక్టోబర్‌లో మరోసారి వివాదం రాజుకుంది. ఆ సమయంలో ఎన్నికల నిర్వహణ తెరమీదకి వచ్చింది. ఈసారి ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ భావిస్తే.. దానికి ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కరోనా స్టార్టింగ్‌ స్టేజ్‌లో వాయిదా వేసి.. పీక్స్‌లో ఉన్నప్పుడు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించింది. ఈ వివాదం సాగుతుండగానే.. నవంబర్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌. ప్రభుత్వం అభ్యంతరపెడుతున్నా.. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకే సిద్ధమయ్యారు. దీనిపై ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈసారి కూడా సర్కార్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల నిర్వహణ ఎస్‌ఈసీ పరిధిలోనిదే అని స్పష్టం చేసింది. అభ్యంతరాలను వారికే వివరించాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టుకు ప్రభుత్వం : –
ఓ వైపు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేమని అభ్యంతర పెడుతున్నా.. నిమ్మగడ్డ మాత్రం పట్టువీడలేదు. ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే ఈసారి ఉద్యోగులు ఎంటర్‌ అయ్యారు. వ్యాక్సినేషన్‌ జరుగుతున్న క్రమంలో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ గవర్నర్‌ను కలిశారు. ఇలా ప్రభుత్వం వర్సెస్‌ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వివాదం దాదాపు పది నెలలుగా ఆరిపోని కార్చిచ్చులా రగులుతూనే ఉంది. ప్రస్తుతం ఎన్నిలక నిర్వహణను నిలిపివేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపులు తట్టగా.. ఎన్నికలు నిర్వహించేందుకు శరవేగంగా ముందుకు కదులుతున్నారు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌. ఇలా ఈ ఎపిసోడ్‌ ఎడతెగని పంచాయితీగా మారింది. మరి సుప్రీం ఏం చెబుతుందో చూడాలి మరి…