ఏపీలో లోకల్ పోరుకు సర్వం సిద్ధం.. రేపే తొలిదశ పోలింగ్

ఏపీలో లోకల్ పోరుకు సర్వం సిద్ధం.. రేపే తొలిదశ పోలింగ్

AP Panchayati elections First Phase Poll : ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల పోరులో తొలిదశ పోలింగ్ మంగళవారం జరగనుంది. ఇందుకోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. సర్పంచ్‌ అభ్యర్థులతో పాటు, వార్డు సభ్యులు ఆదివారం సాయంత్రం వరకూ గ్రామాల్లో హోరాహోరీగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో వారి వ్యూహాలేంటి? పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తు ఏంటి?

ఏపీలో లోకల్ పోరుకు సర్వం సిద్ధమైంది. తొలిదశ ఎన్నికలకు ప్రచారం ముగియడంతో.. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం సాయంత్రం వరకూ.. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు అభ్యర్ధులు. తమకు ఓటు వేయాలని కోరుతూ వీధివీధికీ, ఇంటింటికీ తిరిగారు. పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన కుటుంబ సభ్యులను రప్పించి ఓటు వేయించాలని విజ్ఞప్తి చేశారు అభ్యర్ధులు.

తొలిదశ ఎన్నికల కోసం 3,249 పంచాయతీల పరిధిలో 32,502 వార్డులకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఇందులో 518 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయ్‌. మంగళవారం 2,731 పంచాయతీలకు పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి‌. ఉదయం 6గంటల 30నిమిషాల నుంచి మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాల వరకూ పోలింగ్‌ నిర్వహించనున్నారు అధికారులు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి సర్పంచ్‌ను ప్రకటిస్తారు. శ్రీకాకుళంలో మూడు రెవెన్యూ డివిజన్లలో మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.

శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలోని.. ఎల్‌.ఎన్‌.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో తొలిదశ ఎన్నికలు జరుగుతాయి. విశాఖపట్నంలోని అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు జరగుతాయి. అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి, బుచ్చియ్యపేట, చోడవరంలలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు అధికారులు.

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లో మంగళవారం పోలింగ్ జరుగుతుంది. కాకినాడలోని గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు, యు.కొత్తపల్లి మండలాల్లో ఇప్పటికే అభ్యర్ధులు ప్రచారాన్ని ముగించారు. పెద్దాపురంలోని గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం, తొండంగి, తుని, ఏలేశ్వరం మండలాల్లో అభ్యర్ధులు తమ భవిష్యత్తును పరిక్షించుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు, నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలి మండలాల్లో ఓటర్లు అభ్యర్ధుల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. కృష్ణా జిల్లాలోని విజయవాడ రెవెన్యూ డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం,జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరుళ్లపాడు, విజయవాడ మండలాల్లో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

గుంటూరు జిల్లాలోని తెనాలిలో అమర్తలూరు, బాపట్ల, బట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కాకుమాను, కర్లపాలెం, కొల్లిపరం, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు మండలాల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు జరుగుతాయి.

అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్‌.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్‌.మాగులూరు, ఎస్‌.ఎన్‌.పాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి మండలాల్లో ఎన్నికల కోసం అభ్యర్ధులు ఇప్పటికే ప్రచారం చేశారు. నెల్లూరు జిల్లాలోని కావలి రెవెన్యూ డివిజన్‌లో అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వరికుంటపాడు మండలాల్లో అభ్యర్ధులు ఇప్పటికే గెలుపు కోసం ప్రచారం చేశారు.

వారి భవిష్యత్తును మంగళవారం తేల్చనున్నారు ఓటర్లు. కర్నూలు జిల్లాలోని నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్లలో ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి, దోర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు మండలాల్లోని పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అనంతపురం జిల్లాలోని కదిరి రెవెన్యూ డివిజన్‌లో అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు.