AP Tenth Exams : ఏపీ టెన్త్ పరీక్షల రద్దు వైపు మొగ్గుచూపే ఛాన్స్!
ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే సీబీఎస్ఈతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేయడంతో ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది.
AP Tenth Exams : ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే సీబీఎస్ఈతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేయడంతో ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది. కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తక్షణం ప్రకటించక తప్పని పరిస్దితి ఎదురవుతోంది. అదే సమయంలో పాఠశాలల నిర్వహణనా సందిగ్ధంలో పడింది.
ఏపీలో ప్రస్తుతం రోజుకు ఆరువేల కొత్త కరోనా కేసులు బయటపడుతున్నాయి. పలు జిల్లాల్లో కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలు, పరీక్షలు నిర్వహించలేని పరిస్దితి ఉంది. దీంతో ఈ ప్రభావం ప్రధానంగా పదో తరగతి పరీక్షలపై పడుతోంది. వీటి విషయంలో తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకోలేనని పరిస్ధితుల్లో ప్రభుత్వం ఉంది.తాజాగా కరోనా వ్యాక్సిన్లు విస్తృతంగా వేస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు జూన్లో జరగాల్సి ఉంది. అప్పటివరకూ సమయం ఉన్నందున ఇప్పుడే పరీక్షల్ని రద్దు చేయడం ద్వారా తలెత్తే పరిణామాలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
రాష్ట్రంలో కరోనా పరిస్ధితులను సీఎం జగన్ నిశితంగా గమనిస్తున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు కరోనా వ్యాప్తి అడ్డంకిగా మారిన నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై సీఎం జగన్ ఎల్లుండి సోమవారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇందులో పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్ధుల కోసం పాఠశాలలు నిర్వహిస్తున్నారు.
పరీక్షలు దగ్గరపడుతున్న తరుణంలో విద్యార్ధులు ఎక్కువ సమయం స్కూళ్లలోనే గడపాల్సిన పరిస్దితి. దీంతో తల్లితండ్రుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కూడా పరీక్షల రద్దుకే మొగ్గు చూపే అవకాశం ఉంది. చివరి నిమిషంలో అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప పరీక్షల రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది.