APSRTC Charges : ఏపీలో మళ్లీ పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు.. ఎప్పటినుంచంటే?
ఏపీలో ఏపీఎస్ ఆర్టీసీ మళ్లీ ఛార్జీల బాదుడుకు రెడీ అయింది. జూలై 1 నుంచి ఆర్టీసీ ఛార్జీల పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

APSRTC Charges Hike : ఏపీలో ఏపీఎస్ ఆర్టీసీ మళ్లీ ఛార్జీల బాదుడుకు రెడీ అయింది. శుక్రవారం (జూలై 1) నుంచి ఆర్టీసీ ఛార్జీల పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీలకు అదనంగా డీజిల్ సెస్ పేరిట కొంత మొత్తాన్ని వసూలు చేస్తోంది.
ఇప్పటినుంచి డీజిల్ సెస్ను దూరాన్ని బట్టి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్ సెస్ పెంపుతో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. పెంచిన డీజిల్ సెస్ శుక్రవారం నుంచే అమల్లోకి రానున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. తాజా పెంపుతో డీజిల్ సెస్.. బస్సు టైప్, దూరాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది. పల్లె వెలుగు బస్సుల్లో కనీస చార్జీ ప్రస్తుతం రూ.10గా ఉంది. అదే 30 కిలో మీటర్ల వరకు అయితే పల్లె వెలుగులో డీజిల్ సెస్ పెంపు ఉండదు.

Apsrtc Charges To Be Hiked From July 1, After Increasing Of Diesel Cess In State
30కిలోమీటర్ల నుంచి 60 కిలో మీటర్ల వరకు ప్రస్తుతం వసూలు చేస్తున్న డీజిల్ సెస్కు అదనంగా మరో రూ.5 చెల్లించాల్సిందే. ఈ బస్సుల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు అదనంగా రూ.10 వసూలు చేయనున్నారు. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో డీజిల్ సెస్ పేరిట ఆర్టీసీ బస్సుల్లో రూ.5 వసూలు చేస్తున్నారు. సిటీ బస్సుల్లో డీజిల్ సెస్ను పెంచడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్స్ప్రెస్ బస్సుల్లో 30 కిలో మీటర్ల దాకా డీజిల్ సెస్ పెంచేది లేదు. 31 నుంచి 65 కిలో మీటర్ల వరకు అదనంగా రూ5 వసూలు చేయనుంది.
ఈ బస్సుల్లో 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు అదనంగా రూ.10 వసూలు చేయనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో డీజిల్ సెస్ పేరిట రూ.10 మాత్రమే వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కిలోమీటర్ల వరకు డీజిల్ సెస్ను పెంచలేదు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో ఇకపై డీజిల్ సెస్ కింద రూ.70 చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్సుల్లో డీజిల్ సెస్ పేరిట రూ.80 చెల్లించాల్సి ఉంటుంది.
Read Also : APSRTC: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు.. ఏపీకి కలిసొచ్చింది..