ఫేస్‌బుక్‌తో జాగ్రత్త.. పోలీసులు, రాజకీయ నాయకులు మిమ్మల్ని డబ్బులు అడుగుతారు

  • Published By: naveen ,Published On : September 22, 2020 / 10:55 AM IST
ఫేస్‌బుక్‌తో జాగ్రత్త.. పోలీసులు, రాజకీయ నాయకులు మిమ్మల్ని డబ్బులు అడుగుతారు

పోలీసులు, పొలిటికల్‌ లీడర్స్‌ నుంచి మీకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు వస్తున్నాయా..? నిజమేనని నమ్మేసి ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేస్తున్నారా..? అవసరమున్నాయంటూ డబ్బులు అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారా..? అయితే కాస్త జాగ్రత్త. ఫేస్‌బుక్‌ వేదికగా మిమ్మల్ని బుక్‌ చేసేందుకు నకిలీగాళ్లు..కాచుకు కూర్చున్నారు. మిమ్మల్ని నిండా ముంచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలే నిదర్శనం.

ఫేస్‌బుక్‌ వేదికగా సరికొత్త తరహా మోసం:
ఫేస్‌బుక్‌ వేదికగా సైబర్‌ కేటుగాళ్లు…సరికొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సమాజంలో కాస్త పలుకుబడి, హోదా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వారి పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. భద్రత లేని ఖాతాలను గుర్తించి అందులో ఉన్న ఫోటోలను డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. అనంతరం వాటిని ఉపయోగించి అదే పేరుతో నకిలీ ఖాతాను తెరుస్తున్నారు. వాటి ఆధారంగా ఆ ఖాతాలో అప్పటికే ఉంటున్న స్నేహితులకు మళ్లీ ఫ్రెండ్‌ రిక్వెస్టులను పంపిస్తున్నారు.

మొదట మంచిగా మాట్లాడతారు, ఆ తర్వాత డబ్బు అడుగుతారు:
వాటిని చూస్తున్న స్నేహితులు కొన్ని అనివార్య కారణాలతో మరో ఖాతా తెరచి ఉంటాడని భావించి ఆ రిక్వెస్టులను అంగీకరిస్తున్నారు. ఆ తర్వాత కేటుగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. మొదటగా కొన్ని రోజులు చాట్‌ చేస్తున్నారు. సదరు స్నేహితుడ్ని కుశల ప్రశ్నలు అడగడంతో పాటు..తన పనితీరు ఎలా ఉందని అడుగుతున్నారు.

తియ్యని మాటలతో ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అంత పెద్ద అధికారి తనతో ఈ విధంగా మాట్లాడుతుండటంతో వారి మధ్య సన్నిహిత్యం మరింత పెరుగుతోంది. ఆ తర్వాత తనకు డబ్బు అవసరం పడిందని, ఇప్పుడు ఇస్తే కొన్ని గంటల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ నమ్మబలుకుతున్నారు. వెంటనే తనకు సంబంధించి ఈ-వ్యాలెట్ల నంబర్లను పంపించి..సదరు ఖాతాకు పంపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


కర్నూలు ఎస్ఐ పేరుతో చీటింగ్:
ఇటీవల కర్నూలు జిల్లాలో ఎస్ఐ శ్రీనివాస్‌ పేరుతో చీటింగ్‌కు పాల్పడిన ఘటన మరవకముందే…అదే జిల్లాలో నందివర్గం ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ క్రియేట్‌ చేశాడో మరో సైబర్‌ చీటర్‌. అనంతరం ఎస్‌ఐ జగదీశ్వర్‌ రెడ్డి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి…పాణ్యం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ సుబ్బారెడ్డికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్ పంపాడు. నిజమేనని నమ్మేసిన హోంగార్డు ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేశాడు.

అర్జెంట్‌గా రూ.10 లేదా రూ.50 వేలు కావాలంటూ ఎస్ఐ మెసేజ్‌:
ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేసిన వెంటనే ఆ కేటుగాడు…అర్జెంటుగా 10 వేలు లేదా 50 వేలు కావాలని…ప్లీజ్ హెల్ప్ మీ అంటూ మెసేజ్‌ పెట్టాడు. అయితే ఎస్ఐ తనను డబ్బులు అడగడమేంటని అనుమానం వచ్చిన హోంగార్డు…నిజమో..కాదో.. తెలుసుకునేందుకు ఆ ఎస్‌ఐకి ఫోన్‌ చేశాడు. అయితే ఆ ఫేస్‌బుక్‌ ఖాతా తనది కాదని తెలుసుకున్న ఎస్‌ఐ జగదీశ్వర్‌ రెడ్డి…అప్రమత్తమయ్యాడు. నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్ల భరతం పట్టే పనిలో పడ్డాడు.

రూ.9వేలు కావాలంటూ కానిస్టేబుల్‌ కు మెసేజ్‌:
ఇక..ఈ ఘటనకు రెండు, మూడు రోజలు ముందు…మరో ఎస్ఐ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచి..అత్యవసరంగా డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పంపాడో కేటుగాడు. ఎస్ఐ శ్రీనివాస్‌ పేరుతో కానిస్టేబుల్‌ రామాంజులనాయక్‌కు 9 వేలు కావాలంటూ మెసేజ్‌ పంపాడు. నిజమే అనుకున్న ఆ కానిస్టేబుల్‌ 9 వేలు పంపేందుకు సిద్ధమయ్యాడు.

అయితే డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ కాకపోవడంతో..డబ్బులు వెళ్లడం లేదని ఎస్ఐకి వాట్సాప్‌ మెసేజ్‌ చేశాడు. దీంతో తనకు ఎందుకు డబ్బులు పంపాలనుకుంటున్నావ్‌ అంటూ శ్రీనివాస్‌ నుంచి రిప్లయ్ రావడంతో..తాను మోసపోయినట్లు కానిస్టేబుల్‌ గ్రహించాడు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు…ఆ కేటుగాడిని హర్యానాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఏకంగా స్వాతి లక్రా పేరుతో చీటింగ్:
ఇలా పోలీస్‌ అధికారుల ఫొటోలు, పేర్లు వినియోగించి ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు తెరుస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. అమాయకుల్ని బురిడీ కొట్తిస్తున్నారు. వీటి ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపి, చాటింగ్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్లలో ఉన్న అధికారులతో పాటు డీజీపీ కార్యాలయంలో పని చేసే వారి పేర్లతోనూ ఈ నకిలీ ఖాతాలు తెరుచుకున్నాయి. తాజాగా ఉమెన్ సేఫ్టీ అడిషనల్ డిజి స్వాతీ లక్రా పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలున్నట్టు వెల్లడైంది.

తన పేరుతో కొందరు మోసగాళ్లు నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లు తెరిచి ఫ్రెండ్‌ రిక్వెస్టులు చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతాలో స్పందించారు. ఎవరైనా పొరపాటుగా నకిలీ ఖాతాల నుంచి వచ్చిన ఫ్రెండ్‌ రిక్వెస్టులు యాక్సెప్ట్‌ చేస్తే.. వాటిని వెంటనే అన్‌ఫ్రెండ్‌ చేయాలని కోరారు.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 మంది పోలీసుల పేరుతో మోసాలు:
నకిలీ ఖాతాలు సృష్టించినవారిపై చర్యలు తీసుకుంటామని స్వాతి లక్రా తెలిపారు. కాగా, పోలీస్‌ అధికారుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టిస్తున్న నేరగాళ్లు.. ఫ్రెండ్‌ రిక్వెస్టులు చేసి.. చాట్‌ చేస్తున్నారు. కాస్త నమ్మకం కలిగాక ఏవేవో కారణాలు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారు. ఒడిశా, గుజరాత్‌ల నుంచి సైబర్ నేరగాళ్ల ఆపరేషన్ జరుగున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 మంది పోలీసుల పేరుతో మోసాలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది.

ఎస్ఐ నుంచి డిజి హోదా వరకు అందరి పేర్లతో సైబర్ నేరగాళ్లు వసూళ్లకు పాల్పడ్డారు. నకిలీ ఖాతాల వ్యవహారంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధిత అధికారులు యోచిస్తున్నారు. మరోవైపు ఇలాంటి నేరగాళ్ల బారినపడకుండా ఉండటానికి కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. ఏపీలో విజయవాడ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలువురు పోలీస్‌ అధికారుల పేర్లతో సైబర్‌ కేటుగాళ్లు ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారు.

ఏపీకి చెందిన పలువురు పోలీసులకు సైతం సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో 10 మంది సీఐ, ఎస్ఐల పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లు తెరిచి మోసాలకు తెరలేపారు. ఫేస్ బుక్, వాట్సాప్ ప్రొఫైల్‌లో పోలీసు అధికారుల ఫోటోలు పెట్టి డబ్బు దండుకుంటున్నారు. వారు అడిగేది కూడా రూ. 5- 6 వేలు కావడంతో కొందరు కాదనలేక ఇచ్చేస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్లకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పోలీసు అధికారుల బంధువులు, స్నేహితులు పంపారు.

ఇలా…వీవీఐపీ, వీఐపీ, సినీ ప్రముఖులు, పోలీసుల పేర్లతో ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు వస్తే నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సరిగ్గా తనిఖీ చేసుకున్నాకే ముందుకెళ్లాలని….డబ్బులు అవరమని చాట్‌ చేస్తే మాత్రం సదరు వ్యక్తికి ఫోన్‌ కాల్‌ చేసి నిజమా, కాదా అన్నది నిర్ధారించుకోవాలని అంటున్నారు పోలీసులు.

డబ్బులు అవసరం ఉన్నాయని గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు అడిగితే ట్రాన్స్‌ఫర్‌ చేయవద్దని చెబుతున్నారు. ప్రముఖులు ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా డబ్బులు అడగరని…అలా ఎవరైనా అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు పోలీసులు. అలాగే అలాంటి సైబర్‌ చీటర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఒక్క.. ఫేస్‌బుక్ మాత్రమే కాదు..మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లోనూ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి వారికి చిక్కారో..ఇక చుక్కలు చూపిస్తారు. కాబట్టి కాస్త అలర్ట్‌గా ఉంటే మంచిది.

ఈ విధంగా జాగ్రత్తగా పడండి:
ప్రతి ఒక్కరూ తమకున్న సోషల్ మీడియా అకౌంట్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు. మీ సోషల్ మీడియా అకౌంట్ల (ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రాం..)లో ఓసారి సెర్చ్ బార్‌తో పేరును టైప్ చేసి చూడండి. మీ ఫొటోతో గాని, లేక మీ కుటుంబ సభ్యుల ఫొటోలతో మీ ప్రమేయం లేకుండా ఏవైనా అకౌంట్ ఉందేమో చూడండి. ఒక వేళ మీ పేరుపై మీది లేక మీ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల ఫొటోతో ఏదైనా అకౌంట్ ఉంటే అందులో ఫ్రెండ్ లిస్ట్ చూడండి. మీకు తెలిసిన వ్యక్తులే ఆ లిస్ట్‌లో ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఎందుకంటే వ్యక్తిగత సమాచారంతో మీ అనుమతి లేకుండా మీకు తెలిసిన వ్యక్తులతో సంభాషణలు చేస్తున్నాడంటే కచ్చితంగా దురద్దేశంతోనే అయి ఉండొచ్చు.