CM Jagan : ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు బెడ్స్ కేటాయించాలి : సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు.

CM Jagan : ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు బెడ్స్ కేటాయించాలి : సీఎం జగన్

Cm Jagan

Beds for covid victims : ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు కరోనా బాధితులకు కేటాయించాలని పేర్కొన్నారు. అంతకంటే ఎక్కువ బాధితులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం (మే 6, 2021) కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ పై వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

తాత్కాలిక ఎంప్యానెల్ ఆస్పత్రుల్లోనూ 50శాతం పడకలు కేటాయించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్ ఎంప్యానెల్ ఆస్పత్రులూ కోవిడ్ రోగులకు పడకలు ఇవ్వాలని.. అందుకోసం ఆ ఆస్పత్రులనూ తాత్కాలికంగా ఎంప్యానెల్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని వెల్లడించారు. కోవిడ్ ఆస్పత్రుల వద్దే కరోనా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

తాత్కాలికంగా హ్యాంగర్లలో అన్ని వసతులతో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని.. అవసరమైతే ఆస్పత్రుల వైద్యులే కోవిడ్ కేర్ కేంద్రాల్లో సేవలందిస్తారని సీఎం జగన్ స్పష్టం చేశారు. కరోనా ఆస్పత్రుల్లో నాణ్యమైన భోజనం, పరిశుభ్రత, ఆక్సిజన్, మెడికల్ కేర్, వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ అవసరం మేరకు ఆక్సిజన్ సరఫరా, నిల్వ కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం చేసే కేటాయింపులు సహా ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి సారించాలన్నారు. బోధన ఆస్పత్రుల వద్ద 10కేఎల్, ఇతర ఆస్పత్రుల వద్ద 1కేఎల్ సామర్థ్యం గల ఆక్సిజన్ నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు వీలైనంత త్వరగా ఆ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.