Black Fungus: చాపకింద నీరులా ఫంగస్.. ఏపీలో పలు జిల్లాలలో పదుల కేసులు!
ఒకవైపు కరోనా మహమ్మారి కాస్త ఉదృతి తగ్గుతుందని ఆనందించేలోపే ఫంగస్ హడలెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కరోనా రోగులను భయపెడుతుండగానే ఇప్పుడిప్పుడే వైట్ ఫంగస్ కూడా మరొకటి తయారై సమాజానికి శాపంగా మారుతుంది.

Black Fungus: ఒకవైపు కరోనా మహమ్మారి కాస్త ఉదృతి తగ్గుతుందని ఆనందించేలోపే ఫంగస్ హడలెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కరోనా రోగులను భయపెడుతుండగానే ఇప్పుడిప్పుడే వైట్ ఫంగస్ కూడా మరొకటి తయారై సమాజానికి శాపంగా మారుతుంది. ఇప్పటికే రోజురోజుకూ దేశంలో బ్లాక్ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు పెరుగు తుండడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఇక ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. పలు జిల్లాలలో బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఏపీలోని పలు ప్రధాన నగరాలలో ఈ కేసులతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజుకు పదులు సంఖ్యలో బ్లాక్ ఫంగస్ బారిన పడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఫంగస్ బారిన పడ్డవారిలో ఎక్కువగా కరోనా నుంచి కోలుకున్నవారే ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి చూస్తుంటే పలు జిల్లాలో బ్లాక్ ఫంగస్ వ్యాప్తి ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. అనంతపురం జిల్లాలో బుధవారం ఒక్క రోజే 17 మంది వ్యాధి లక్షణాలతో సర్వజనాస్పత్రిలో చేరగా.. బుధవారం చేరిన వారితో ఇక్కడ 62 మంది బ్లాక్ ఫంగస్తో చికిత్స పొందుతున్నారు.
ఇప్పటికే అనంతపురం వైద్యులు నలుగురికి శస్త్ర చికిత్సలు చేయగా వారు కోలుకుంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోనూ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఈ జిల్లా పరిధిలో బుధవారం నాటికి 53 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కరోనా నుండి కోలుకున్న వారు కొందరు వారాల వ్యవధిలోనే ఫంగస్ లక్షణాలతో మళ్ళీ ఆసుపత్రులకు వస్తున్నారు. అయితే.. లక్షణాలను బట్టి ఇది ముందుగానే గుర్తిస్తే చికిత్స ఉందని.. భయాందోళనను అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు.