ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేక చెల్లిని వ్యభిచార ముఠాకి అమ్మేసిన అన్న, వదిన..ప్రకాశం జిల్లాలో దారుణం

  • Published By: naveen ,Published On : July 21, 2020 / 11:29 AM IST
ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేక చెల్లిని వ్యభిచార ముఠాకి అమ్మేసిన అన్న, వదిన..ప్రకాశం జిల్లాలో దారుణం

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం జరిగింది. అన్న, వదినలు అమానుషంగా వ్యవహరించారు. రూ.27వేలకు చెల్లిని వ్యభిచార ముఠాకు అమ్మేశారు. వ్యభిచార ముఠా నిర్వాహకులు బాలికను ఓ ఇంట్లో నిర్బంధించారు. వారి వేధింపులు తాళలేకపోయిన బాధితురాలు 100కు డయల్ చేసింది. జరిగిన విషయం చెప్పి తనను కాపాడాలని వేడుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలికను వ్యభిచార ముఠా చెర నుంచి కాపాడారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆడబిడ్డను ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేక:
ఆడబిడ్డను ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేక వదిన వ్యభిచార ముఠాకు అమ్మేసింది. చివరకు ఆ బాలిక నరకకూపం నుంచి బయటపడింది. నెల్లూరు జిల్లా కావలికి సమీపంలోని ముసునూరు ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇద్దరు భార్యలు. రెండో భార్య కూతురు పదో తరగతి చదువుతూ మధ్యలోనే ఆపేసింది. బాలిక తల్లి, తండ్రికి తరచూ గొడవలు జరగడంతో ఆమె తన అన్న, వదినల దగ్గర ఉంటోంది. అయితే బాలికను ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేని వదిన ఆమెను ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఓ వ్యభిచార ముఠాకు అమ్మేసింది. వ్యభిచార నిర్వాహకులు బాలికతో కందుకూరు, సింగరాయకొండ రోడ్డులో ఉన్న ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద ఇంట్లో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. బాలిక తప్పించకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా కుదరలేదు. నాలుగు రోజుల క్రితం ఎలాగోలా డయల్ 100 కి కాల్ చేసి విషయం చెప్పింది. వెంటనే రంగంలోకి దిగిన కందుకూరు పోలీసులు ప్లాన్ ప్రకారం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి జూలై 18న బాలికను రక్షించారు.

పరారీలో నిందితులు:
డబ్బు కోసం వదిన తనను అమ్మిందని, ముఠా నిర్వాహకులు మాధవి, శ్రీకాంత్ తనతో అమానుషంగా ప్రవర్తించారని బాలిక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు వారితో పాటు ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు బాలికను కందుకూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు కనుమరుగు అవుతున్నాయి. కాసుల కోసం అయిన వారినే కడతేరుస్తున్నారు. డబ్బు, నగలు, ఆస్తి కోసం రక్త సంబంధీకులను చంపేస్తున్నారు. చెల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అన్ననే దారుణంగా వ్యవహరించారు. అన్ననే తన చెల్లెలిని వ్యభిచార ముఠాకు అమ్మేసి ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఆ నీచుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సొంత ఇంట్లోనే ఆడపిల్లకు రక్షణ కరువైందని వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అసలేం జరిగింది? ఆ అన్న ఎందుకిలా చేశాడు? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలిశాక అన్న, వదినలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.