TDP పాలనపై CBI విచారణ : ఏం జరుగబోతోంది
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుక, చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుకలాంటి పథకాలపై సీబీఐ విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఈ మేరకు సీఎం జగన్కు కేబినెట్ సబ్ కమిటీ టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై నివేదికను అందజేసింది. అందులో ఫైబర్ గ్రిడ్లో సుమారు రూ. 700 కోట్ల అవినీతి జరిగినట్టు కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించింది. ఇక చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న కానుకలాంటి పథకాల ద్వారా మరో 158 కోట్ల అవినీతి జరిగిందని ఉపసంభం తేల్చింది. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి 40కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. హెరిటేజ్ మజ్జిక ప్యాకెట్ల సరఫరా, ఖర్చులపైనా సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. వీటిపై చర్చించిన ఏపీ కేబినెట్ చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని నిర్ణయించింది.
టీడీపీ హయాంలోని పథకాలపై సీబీఐ విచారణ జరిపితే.. అది కేవలం చంద్రబాబు ఒక్కడితోనే అయిపోదు. చంద్రబాబు హయాంలో పనిచేసిన ఐటీశాఖ, పౌరసరఫరాలశాఖ మంత్రుల మెడకు కూడా అది చుట్టుకుంటుంది. చంద్రబాబు హయాంలో నారా లోకేశ్ ఐటీశాఖ మంత్రిగా ఉన్నారు. అంతకుముందు పల్లె రఘునాథరెడ్డి ఐటీశాఖ బాధ్యతలు చూశారు. లోకేశ్ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఐటీశాఖ పగ్గాలు ఆయనకు అప్పగించారు. ఇక పౌరసరఫరాల శాఖ మంత్రిగా పరిటాల సునీత పనిచేశారు. చంద్రన్న కానుకలు అన్నీ సివిల్ సప్లై శాఖ ద్వారానే పంపిణీ చేశారు. దీంతో ఇప్పుడు పరిటాల సునీత మెడకూ సీబీఐ ఉచ్చు బిగుసుకోనుంది.
Read: ఆగస్టు నుంచి గ్రామాల పర్యటన, సీఎం జగన్ కీలక నిర్ణయం