Chandrababu House : చంద్రబాబు ఇంటి జప్తు.. విచారణ 16కు వాయిదా
Chandrababu House : ఈ వివాదంపైన అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ అధికారి విచారణకు రావాలని కోర్టు ఆదేశించింది.
Chandrababu House – ACB Court : టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి జప్తు (లింగమనేని గెస్ట్ హౌస్) వివాదంపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తమ వాదనలు వినాలని ప్రతివాదులు దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. కరకట్ట వివాదంపైనా తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.
ఈ పిటిషన్ లో ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని సూచించింది. ఈ వివాదంపైన అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ అధికారి విచారణకు రావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని ఏసీబీ కోర్టు తెలిపింది.
కరకట్టపై ఉన్న ఇంట్లో చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి జప్తునకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఇంటి జప్తునకు ఇప్పటికిప్పుడు అనుమతి ఇవ్వలేమని కోర్టు తెలిపింది. ప్రాధమిక ఆధారాలపై విచారణ జరపాలని, ఇంటిని జప్తు చేయాలని కోరిన అధికారిని కూడా విచారించాల్సి ఉందని వెల్లడించింది. అనంతరం విచారణనను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు దగ్గర లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ ఉంది. దాన్ని చంద్రబాబు తన నివాసంగా వినియోగిస్తున్నారు. ఈ ఇంటి జప్తునకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతోంది. సీఆర్డీఏ, మాస్టర్ ప్లాన్ లో ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించి అవకతవకలు జరిగాయని.. ఇందులో భారీ మొత్తంలో లింగమనేని రమేశ్ కు చంద్రబాబు నాయుడు లబ్ది చేకూర్చే విధంగా వ్యవహరించారని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది.
ప్రతిఫలంగా లింగమనేని రమేశ్ తన గెస్ట్ హౌస్ ను చంద్రబాబుకి గిఫ్ట్ ఇచ్చారని ఆరోపణలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించారంది. అయితే, ఇందులో ఎలాంటి అవకతవకలు లేవని, చంద్రబాబు కేవలం అద్దెకు ఉంటున్నారని లింగమనేని రమేశ్ న్యాయవాది చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఏమని తీర్పు ఇవ్వనుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. లింగమనేనికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏ విధంగా ముందుకెళ్లాలని టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు.
Also Read..Tirupati : పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. అడ్డంగా దొరికిపోయిన స్మగ్లర్లు