Chevireddy Bhaskar Reddy: అందుకే మా వాడిని తెరపైకి తీసుకొచ్చా.. వెల్లడించిన చెవిరెడ్డి

చంద్రగిరి నియోజకవర్గం తనకు కన్నతల్లిలాంటిదని, తనకు మల్లే సేవ చేసే అవకాశం తన కుమారుడికి కూడా ఇవ్వాలని స్థానికులను కోరారు.

Chevireddy Bhaskar Reddy: తన కుమారుడు మోహిత్ రెడ్డిని ఆశీర్వదించాలని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. ఇన్నాళ్లు తనను ఆదరించినట్టుగానే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని చంద్రగిరి వాసులకు విన్నవించారు. ఎర్రావారిపాళెం, పాకాల, చిన్నగొట్టిగల్లు మండలాల్లో శుక్రవారం నిర్వహించిన సభల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) మాట్లాడారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తును చంద్రగిరి నియోజకవర్గ ప్రజల చేతుల్లో పెడుతున్నట్టుగా ప్రకటించారు.


చంద్రగిరి నియోజకవర్గం (chandragiri constituency) తనకు కన్నతల్లిలాంటిదని, తనకు మల్లే సేవ చేసే అవకాశం తన కుమారుడికి కూడా ఇవ్వాలని స్థానికులను కోరారు. తాను పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్రమంతా పర్యటించాల్సిన ఉన్నందున నియోజకవర్గ బాధ్యతలను తన కుమారుడికి అప్పగించినట్టు చెప్పుకొచ్చారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగానే తాను నడుచుకుంటున్నట్టు వెల్లడించారు. కాగా, వైసీపీ 23 అనుబంధ సంఘాల రాష్ట్ర ఇన్ చార్జిగా భాస్కర్ రెడ్డి కొనసాగుతున్నారు. తుడా చైర్మన్ గానూ ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం
కాగా, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా మోహిత్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(Chevireddy Mohith Reddy) అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆయన గెలుపును కోరుతూ అలిపిరి పాదాల మండపం వద్ద శనివారం చంద్రగిరి వైసీపీ నేతలు 1001 కొబ్బరికాయలు కొట్టారు. వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని దీమా వ్యక్తం చేశారు.

Also Read: ఉండవల్లి శ్రీదేవికి అండగా నిలిచిన మంద కృష్ణ మాదిగ.. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు